
- తెలంగాణ చౌక్లో రాజేందర్ రావు ఫ్లెక్సీకి అనుచరుల క్షీరాభిషేకం
- వెలిచాలపై చర్యలు తీసుకోవాలని కవ్వంపల్లి అనుచరుల ఆందోళన
కరీంనగర్, వెలుగు: కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు అభిమానులు, డీసీసీ అధ్యక్షుడు, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ వర్గీయుల మధ్య గురువారం ఫ్లెక్సీ వివాదం నెలకొంది. ఈ సందర్భంగా వెలిచాల వర్గీయులు మాట్లాడుతూ ఎమ్మెల్యే జగపతిరావుకు దళితులతో ఎంతో ఆత్మీయత అనుబంధం ఉండేదనీ, ఆ అనుబంధాన్ని వారి కొడుకు రాజేందర్ రావు కొనసాగిస్తున్నారన్నారు. కరీంనగర్ తెలంగాణ చౌక్లో గురువారం వెలిచాల రాజేందర్రావు ప్లెక్సీకి అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకొని క్షీరాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా టవర్ సర్కిల్, గాంధీ రోడ్ లో వెలిచాల రాజేందర్ రావు యువసేన పేరిట ఫ్లెక్సీ ఏర్పాటు చేశామని, ఆ ఫ్లెక్సీలతో రాజేందర్ రావుకు, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇందులో డీసీసీ అధ్యక్షుడు, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఫొటో పెట్టలేదనడం, కొంతమంది కాంగ్రెస్ పార్టీకి చెందిన దళిత సామాజిక వర్గం వారు ధర్నా చేయడం సరికాదన్నారు. కార్యక్రమంలో వెలిచాల రాజేందర్ రావు యువసేన జిల్లా అధ్యక్షుడు కిరణ్ కుమార్, రాజేందర్ రావు అభిమానులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కవ్వంపల్లి అనుచరుల ఆందోళన
కాగా వెలిచాల రాజేందర్ రావు అనుచరులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ల్లో డీసీసీ అధ్యక్షుడు, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఫొటో లేదంటూ ఎమ్మెల్యే అనుచరులు కరీంనగర్ తెలంగాణ చౌక్ లో ఆందోళనకు దిగారు. పార్టీ నుంచి వెలిచాలని సస్పెండ్ చేయాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు కొరివి అరుణ్ కుమార్, అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు కాదాసి ప్రభాకర్ పాల్గొన్నారు.