
వేములవాడ, వెలుగు: వేములవాడ రాజన్న కోడెల కోసం పచ్చి గడ్డిని సాగు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. బుధవారం వేములవాడ మున్సిపల్ పరిధిలోని తిప్పాపూర్ గోశాలను తనిఖీ చేశారు. ముందుగా గోశాల ఆవరణ, కోడెలు, గడ్డిని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ వేములవాడ పరిధిలోని హనుమక్కపల్లిలో 22 ఎకరాలు, మర్రిపల్లిలో 40 ఎకరాలు, మూడపల్లిలోని 20 ఎకరాలు మొత్తం 82 ఎకరాల ప్రభుత్వ భూముల్లో పచ్చి గడ్డి పెంపకానికి చర్యలు తీసుకోవాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రవీందర్ రెడ్డికి సూచించారు. గోశాలలో పనిచేసేందుకు ఇటీవల నియమించిన సిబ్బందిని విధుల్లోకి తీసుకోవాలని, వారికి డ్రెస్ కోడ్, ఐడీ కార్డ్స్ అందించాలని సూచించారు,
కార్యక్రమంలో రాజన్న ఆలయ ఇన్చార్జి ఈవో రాదాభాయ్, పశుసంవర్ధక అధికారి రవీందర్ రెడ్డి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అంతకుముందు మున్సిపల్ పరిధిలోని తిప్పాపూర్ అంగన్వాడీ కేంద్రం, ప్రైమరీ స్కూల్ను సందర్శించారు. అంగన్వాడీలో పిల్లల హాజరు వివరాలు అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు అందిస్తున్న కోడిగుడ్లు, ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. అనంతరం ప్రైమరీ స్కూల్లో హెచ్ఎం సమాచారం లేకుండా స్కూల్కు ఆబ్సెంట్ కావడంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డీఈవో వినోద్ కుమార్ను ఆదేశించారు.
రైతులకు సకాలంలో ఎరువులు అందించాలి
రాజన్న సిరిసిల్ల, వెలుగు: రైతులకు సకాలంలో ఎరువులు అందించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. బుధవారం కలెక్టరేట్లో ఎరువుల సరఫరాపై వివిధ కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాజన్నసిరిసిల్ల జిల్లాలో అవసరమైన మేర ఎరువుల స్టాక్ను అందుబాటులో ఉంచాలన్నారు. ప్రతి డీలర్ నిబంధనల ప్రకారం ఈపాస్ యంత్రాల ద్వారా మాత్రమే ఎరువుల అమ్మాలన్నారు. సమావేశంలో డీఏవో అఫ్జల్బేగం, వివిధ ఎరువుల కంపెనీ ప్రతినిధులు, ఆఫీసర్లు పాల్గొన్నారు.