‘సైరా చిరంజీవి’.. ఉపరాష్ట్రపతి రియాక్షన్ ఇదే

‘సైరా చిరంజీవి’.. ఉపరాష్ట్రపతి రియాక్షన్ ఇదే

ఢిల్లీలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సైరా నరసింహారెడ్డి సినిమా చూశారు. తనకోసం ప్రత్యేకంగా వేసిన షో ను వెంకయ్యనాయుడు… మెగాస్టార్ చిరంజీవి సహా సినిమా యూనిట్ తో కలిసి చూశారు. ఢిల్లీలో తన సినిమాపై ప్రచారం చేస్తూ… ప్రధానమంత్రి మోడీ సహా.. ప్రముఖులను కలుస్తున్నారు చిరంజీవి.

సైరా సినిమా చాలా బాగా తీశారని అభినందించారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. చిరంజీవి, నిర్మాత రామ్ చరణ్, దర్శకుడు సురేందర్ రెడ్డి చక్కని చిత్రాన్ని నిర్మించారని అన్నారు. సినిమాలో వలస పాలకుల నియంత పాలన గురుంచి బాగా చూపించారని అన్నారు. సైరా సినిమా వల్ల ప్రజల్లో దేశం మీద ప్రేమ మరింత పెరుగుతుందని చెప్పారు. భారత దేశం యొక్క స్వరూపాన్ని  సైరా చూపించారనీ.. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రపై సినిమా తీయడం గొప్ప నిర్ణయం అని అన్నారు.

“సైరా సినిమాలో చిరంజీవి నటన చాలా బాగుంది. అమితా బచ్చన్ తోపాటు..  తమన్నా, నయనతార చాలా బాగా నటించారు. ఇలాంటి సినిమాలు ఇంకా రావాల్సిన అవసరం ఉంది”అని వెంకయ్యనాయుడు చెప్పారు.

“వెంకయ్యనాయుడు గారు సమయం తీసుకొని సినిమా చూడడం చాలా సంతోషంగా ఉంది. ఒకొక్క మెట్టు ఎక్కుకుంటూ రాజకీయాలలో ఆయన ఎదిగారు.  ప్రధానమంత్రిని కలిసి సినిమాకు ఆహ్వానిస్తాను” అని చిరంజీవి చెప్పారు.