అదే నా తపన

అదే నా తపన

‘నీదీ నాదీ ఒకే కథ’తో దర్శకుడిగా తనకంటూ ఓ మార్క్‌‌ను క్రియేట్‌‌ చేసుకున్న డైరెక్టర్ వేణు ఊడుగుల.. రెండో ప్రయత్నంగా నక్సలిజం బ్యాక్‌‌డ్రాప్‌‌లో ‘విరాటపర్వం’ 
అనే ప్రేమకథను తెరకెక్కించాడు. రానా, సాయిపల్లవి జంటగా రూపొందిన ఈ చిత్రం జూన్ 17న విడుదలవుతున్న సందర్భంగా వేణు ఇలా ముచ్చటించాడు. 

‘‘తెలంగాణ ఒక రాజకీయ ప్రయోగశాల. ఒకప్పుడు ఇక్కడ జరిగినవి దేశ రాజకీయాల్ని ప్రభావితం చేశాయి. అలాంటి రాజకీయ, ఉద్యమ వాతావరణంలో పెరగడం వల్ల ఆ ప్రభావం నాపై ఉంది. చరిత్రలో దాచిన,  దాగిన కథల్ని జనాలకు చెప్పాలనుకునే నా ఇంటెన్షన్‌‌ నుంచి వచ్చిందే ఈ కథ. రియల్ ఇన్సిడెంట్స్ స్ఫూర్తితో సరళ అనే మహిళ జీవితం ఆధారంగా ఈ సినిమా తీశాను. అలాగని బయోపిక్ కాదు. సినిమాటిక్‌‌గా కొంత ఫిక్షన్ ఉంటుంది.  వెన్నెల అనే అమ్మాయి ప్రేమకథ ఇది. తొంభైల నాటి రాజకీయ సందర్భాన్ని ఒక వ్యక్తిగతమైన సంఘర్షణగా చూపిస్తున్నాం. ఇదేమీ మావో సిద్ధాంతాలనో, నక్సలిజాన్నో బలపరిచే ప్రాపగాండా మూవీ కాదు. నక్సలిజం అనేది కథను ముందుకు నడిపించేదే తప్ప అదే మెయిన్ స్టోరీ కాదు. కథ రాసుకున్నప్పుడే సాయిపల్లవిని ఊహించుకునేవాణ్ని. పది నిముషాల నేరేషన్ ఇవ్వగానే ఆమె వెంటనే ఓకే చెప్పారు. ఆమే కాదు.. నిర్మాతలతో సహా అందరూ సింగిల్‌‌ సిట్టింగ్‌‌లో ఓకే చేశారు. కథలోనే ఆ పాజిటివ్ వైబ్రేషన్ ఉంది. వెన్నెల కథే అయినా చంద్రుడు లేకుండా వెన్నెల ఉండదు కాబట్టి రానా పాత్రకి కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆయన ఈ సినిమాకి ఒప్పుకోవడం కథ గొప్పతనం, ఆయన గొప్పతనమే. నాలాంటి కొత్త దర్శకుడు కొత్త ఆలోచనతో చేస్తున్న సినిమాకి సపోర్ట్ చేస్తే మంచి ప్రాజెక్ట్ అవుతుందని సరే అన్నారు. మధ్యలో ఓటీటీ ఆఫర్స్ వచ్చినా నిర్మాతలు కథను నమ్మి థియేటర్స్‌‌లో విడుదల చేస్తున్నారు. హ్యూమన్ రిలేషన్స్ ప్రేక్షకులకు ఎప్పుడూ నచ్చుతాయి. వాటిని ఏ నేపథ్యంలో ఎలా చెబుతున్నామనేదే ముఖ్యం. ఇది కూడా అలాంటి సినిమానే కనుక థియేటర్‌‌‌‌ నుంచి ఇంటికెళ్లాక కూడా నా సినిమా ఇంపాక్ట్ ప్రేక్షకుల్లో ఉంటుందని నమ్ముతున్నా. ఆలోచింపజేసే సినిమాలు తీయాలనేది నా తపన. అలాంటివే రెండు కథలు రాశాను. అలాగే ‘ఆహా’ కోసం నేను షో రన్నర్‌‌‌‌గా చలం గారి ‘మైదానం’ని సినిమాగా తీస్తున్నాం. సిద్ధార్థ అనే మరో దర్శకుడు డైరెక్ట్ చేస్తున్నాడు.’’