
హైదరాబాద్, వెలుగు: భారత పశువైద్య వ్యాక్సిన్ రంగాన్ని ప్రోత్సహించేందుకు వెటర్నరీ వ్యాక్సిన్ ఇండియా మాన్యుఫాక్చరింగ్ అసోసియేషన్ (వీవీఐఎంఏ) ఏర్పాటైంది. ఇది ప్రభుత్వేతర, లాభాపేక్షలేని సంస్థగా, నాణ్యమైన తయారీ, ఆవిష్కరణ, ప్రపంచ పోటీతత్వం కోసం ప్రభుత్వంతో కలిసి చురుకుగా పనిచేస్తుంది.
వన్ హెల్త్ థీమ్కు కట్టుబడి, జంతు ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, జూనోటిక్ వ్యాధుల వ్యాప్తిని తగ్గించడం, గ్రామీణ ఆదాయాలను పెంచడం వంటి లక్ష్యాలతో ముందుకు సాగుతామని వీవీఐఎంఏ పేర్కొంది. ఈ సంఘం వ్యవస్థాపక సభ్యులు ఈ నెల 25న ఢిల్లీలో కేంద్ర పశుసంవర్ధక శాఖతో సమావేశమయ్యారు.
వీవీఐఎంఏ అధ్యక్షుడు రాజీవ్ గాంధీ, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ఆనంద్ కుమార్, సభ్యుడు డాక్టర్ సంజయ్ గవ్కరే మాట్లాడుతూ, వీవీఐఎంఏ భారతదేశాన్ని పశువైద్య వ్యాక్సిన్ల పరిశోధన, అభివృద్ధి, ఉత్పత్తిలో ప్రపంచ కేంద్రంగా మార్చే దిశగా కృషి చేస్తుందని తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్కు అనుగుణంగా ప్రభుత్వంతో కలిసి పని చేస్తోందన్నారు.