ట్రిపుల్​ ఆర్ సర్వేను మళ్లీ అడ్డుకున్న బాధితులు

ట్రిపుల్​ ఆర్ సర్వేను మళ్లీ అడ్డుకున్న బాధితులు
  •  వర్కట్​పల్లిలో సర్వే అడ్డుకున్న బాధితులు
  • ఎన్నిసార్లు నష్టపోవాలని ఆందోళన

యాదాద్రి, వెలుగు: వలిగొండ మండలం రెడ్ల  రేపాక, వర్కట్​పల్లి, చౌటుప్పల్​ మండలం నేలపట్లలో సర్వే పనులను బాధితులు మంగళవారం అడ్డుకున్నారు. అలైన్​మెంట్​ మార్చాలని డిమాండ్​ చేశారు. ఇప్పటికే పలుమార్లు భూములను కోల్పోయామని, మరోసారి కోల్పోలేమని తేల్చి చెబుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే పరిహారం తమకు అవసరం లేదని డిమాండ్​ చేశారు. రీజినల్​ రింగ్​ రోడ్డు కోసం యాదాద్రి జిల్లాలోని ఐదు మండలాల్లో 1853.04 ఎకరాలను సేకరించాల్సి ఉంది. తుర్కపల్లి, యాదగిరిగుట్ట మండలాల్లో 580.17 ఎకరాలు, భువనగిరిలో 492, వలిగొండ, చౌటుప్పల్​ మండలాల్లో 780.27 ఎకరాలను సేకరించనున్నారు. గతంలోనే గెజిట్​ నోటిఫికేషన్​ విడుదల చేశారు. ఇప్పటికే తాము భూములు ఇచ్చామని, మళ్లీ ఇవ్వమంటే ఎలా..? అంటూ రైతులు సర్వేను అడ్డుకున్నారు. రైతులు అడ్డుకుంటున్నా పోలీసుల సహకారంతో సర్వే ముగించారు. ఇప్పుడు ఫైనల్​ గెజిట్​ కోసం సర్వే నెంబర్లు, రైతుల వారీగా సర్వే చేస్తున్నారు. 

అలైన్​మెంట్​ మారదంటున్న ఆఫీసర్లు

రైతులు సర్వేను ఆపినా.. అలైన్​మెంట్​ మారదని ఆఫీసర్లు చెబుతున్నారు. రింగ్​రోడ్డుకు సంబంధించిన సర్వే గతంలోనే ముగిసిపోయిందని, దీనికి సంబంధించి రోడ్డు మ్యాప్​ కూడా రెడీ అయిందని ఆఫీసర్లు చెబుతున్నారు. సర్వేను అడ్డుకుంటే రికార్డుల్లో ఉన్న రైతుల పేర్లతో గెజిట్​ను ప్రభుత్వం ప్రచురిస్తుందని అంటున్నారు. దీనివల్ల అనుభవదారుడిగా ఉన్న రైతుకు పరిహారం అందకుండా నష్టం జరుగుతుందని చెబుతున్నారు. భూ సేకరణపై ఇటీవల నిర్వహించిన సర్వేకు తాము పబ్లిష్​ చేసిన గెజిట్​లో పేర్కొన్న భూ సేకరణ వివరాలకు మధ్య ఏ మాత్రం భూ విస్తీర్ణం తేడా ఉన్నా ఆయా సర్వే నెంబర్ల వారీగా  త్రీ ఏ నోటిఫికేషన్​ జారీ చేస్తామని అంటున్నారు.  గెజిట్​లో పేర్కొన్న విస్తీర్ణానికి, తాము నిర్వహించిన సర్వేలో తేలిన భూమికి తేడా లేకుంటే ఆయా సర్వే నెంబర్లకు సంబంధించి పూర్తి వివరాలతో త్రీ డీ(డిక్లరేషన్​) నోటిఫికేషన్​ జారీ చేస్తామంటున్నారు. ఈ రెండు నోటిఫికేషన్ల తర్వాత గడిచిన మూడేండ్లలో ఏడాది వారీగా భూముల ధరల్లో మార్పులను పరిశీలించిన తర్వాత పరిహారానికి సంబంధించి నేషనల్​ హైవే ఆఫీసర్లు అవార్డు ప్రకటిస్తారని ఆఫీసర్లు తెలిపారు. 

అనుభవదారుల కోసం

- ఉపేందర్​రెడ్డి, ఆర్డీవో, చౌటుప్పల్​

రీజినల్​ రింగ్​ రోడ్డు కోసం భూమిని కోల్పోయే వారికి పరిహారం అందించడం కోసం సర్వే జరుగుతోంది. సర్వే నెంబర్ల వారీగా రికార్డుల్లో ఉన్న వారు, అనుభవదారుడిగా ఉన్న రైతు ఒక్కరేనా.? వేర్వేరా..? అన్నది తెలుసుకుంటున్నాం. ఈ సర్వే పూర్తైన తర్వాత పరిహారం అందించాల్సిన రైతుల పేర్లతో గెజిట్​ ప్రచురణ జరుగుతుంది.