
- ఇందుకోసం డీ2ఎం టెక్నాలజీ
న్యూఢిల్లీ : స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన డైరెక్ట్- టూ -మొబైల్ (డీ2ఎం) టెక్నాలజీ ద్వారా మొబైల్ ఫోన్లకు నేరుగా వీడియోలను చూడవచ్చని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం త్వరలో 19 నగరాల్లో ట్రయల్స్ నిర్వహిస్తామని సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర తెలిపారు. డీ2ఎం టెక్నాలజీ ద్వారా మొబైల్ వినియోగదారులు సిమ్ కార్డ్ లేదా ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండానే వీడియోలను స్ట్రీమ్ చేయవచ్చు. సమీప భవిష్యత్తులో డైరెక్ట్ -టు-మొబైల్ టెక్నాలజీ అందరికీ అందుబాటులోకి వస్తుంది.
డీ2హెచ్, ఎఫ్ఎం రేడియో తరహాలోనే ఈ టెక్నాలజీ పనిచేస్తుంది. డీ2ఎం ట్రయల్స్ కోసం 470-–582 మెగాహెజ్ స్పెక్ట్రమ్ను ఉపయోగిస్తామని చంద్ర వెల్లడించారు. మొబైల్స్కు నేరుగా వీడియోలు ప్రసారం కావడం వల్ల టెలికం, బ్రాడ్బ్యాండ్నెట్వర్క్లపై భారం తగ్గుతుందని చెప్పారు. డీ2ఎం టెక్నాలజీని పరీక్షించడానికి గత ఏడాది బెంగళూరు, కర్తవ్య పథ్, నోయిడాలో పైలట్ ప్రాజెక్టులు జరిగాయి.