
- రెండ్రోజులుగా తనిఖీలు చేస్తున్న సిక్స్ మెంబర్ టీమ్
- కన్నెపల్లి పంప్హౌస్ వివరాల సేకరణ
- ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నం: విజిలెన్స్ డీజీ రాజీవ్ రతన్
మేడిగడ్డ బ్యారేజీ కుంగడానికి గల కారణాలు తెలుసుకునేందుకు, అక్రమాలుంటే వెలికి తీసేందుకు తమ టీమ్ ఫీల్డ్ విజిట్ చేపట్టిందని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ రాజీవ్ రతన్ తెలిపారు. ఇందులో భాగంగానే రెండు రోజులుగా భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలు, కన్నెపల్లి పంప్హౌస్ను పరిశీలిస్తున్నట్లు గురువారం ఆయన వెల్లడించారు. ‘మేడిగడ్డ బ్యారేజీ ఎందుకు కుంగింది?.. డిజైన్లలో లోపం ఉందా? నాసిరకం పనులు చేశారా?.. ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు అనేది తెలుసుకుకోవడానికి వచ్చాం. కాళేశ్వరం ప్రాజెక్ట్లో భాగంగా నిర్మించిన అన్నారం, మేడిగడ్డ బ్యారేజీల పనులను కంపేర్ చేసి చూస్తున్నాం’ అని అన్నారు. వీటితోపాటు కన్నెపల్లి పంప్హౌస్ పనుల వివరాలు కూడా సేకరించినట్టు చెప్పారు. చేసిన పనులు, జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. ఇది పెద్ద మొత్తంలో ప్రజాధనాన్ని ఖర్చు చేసి కట్టిన ప్రాజెక్టును పాయింట్ టూ పాయింట్ పరిశీలించాల్సి ఉందన్నారు. చాలా వరకు సమాచారం సేకరించామని.. ఫీల్డ్ ఎంక్వైరీ పూర్తి చేసి నష్టం ఎలా జరిగింది? కారకులెవరు అనేది అనలైజ్ చేసి ప్రభుత్వానికి రిపోర్ట్ ఇస్తామని చెప్పారు. డీజీ వెంట విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అడిషినల్ ఎస్పీ బాలకోటి, ఇన్స్పెక్టర్లు రాకేశ్, అనిల్, హన్నన్, విజిలెన్స్ డీఈ విద్య ఉన్నారు.
రోజంతా తనిఖీలు
విజిలెన్స్ డీజీ రాజీవ్ రతన్ ఆధ్వర్యంలో ఆరుగురు సభ్యుల బృందం బుధవారం మధ్యాహ్నం జిల్లాకు వచ్చింది. ఇరిగేషన్ ఆఫీసర్లను విచారించింది. గురువారం ఉదయం 10 గంటల నుంచి ఫీల్డ్ ఎంక్వైరీ ప్రారంభించింది. సాయంత్రం 5 గంటల వరకు తనిఖీలు చేపట్టారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగడం, అన్నారం బ్యారేజీలో బుంగలు ఏర్పడటం, కన్నెపల్లి పంప్హౌస్ మునిగి మోటార్లు పనికిరాకుండా పోవడం, ఫోర్ బేస్మెంట్ గోడ కూలడంపై డీజీ.. ఇరిగేషన్ ఇంజినీర్లపై ప్రశ్నల వర్షం కురిపించారు. విజిలెన్స్ టీమ్ ముందుగా కన్నెపల్లి(లక్ష్మీ) పంపుహౌస్ పరిశీలించింది. అడుగు భాగంలో అమర్చిన మోటార్ల వద్దకు వెళ్లి చెక్ చేశారు. ఏడాదిన్నర కింద వరదలకు కూలిపోగా తిరిగి మళ్లీ కట్టిన ఫోర్ బేస్మెంట్ గోడను, కమాండ్ కంట్రోల్ రూమ్ ను, అప్రోచ్ కెనాల్, డెలివరీ చానల్ ను టీమ్ మెంబర్లు పరిశీలించారు. గతంలో గోదావరి వరదలు వచ్చినప్పుడు పంప్హౌస్ మునిగిపోవడం వెనక కారణాలను ఇంజినీర్లను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత అన్నారం బ్యారేజీకి చేరుకొన్నారు.
.
అక్కడ గంటన్నరపాటు ఫీల్డ్ ఎంక్వైరీ చేపట్టారు. బ్యారేజీలో బుంగలు పడిన 38వ, 28వ పిల్లర్లను తనిఖీ చేశారు. బ్యారేజీ అప్ స్ట్రీం, డౌన్ స్ట్రీం పరిశీలించారు. డయాఫ్రామ్ వాల్, షీట్ ఫైల్, బ్యారేజీ ఫౌండేషన్, సిమెంట్ బ్లాక్స్ తదితర అంశాలపై అడిగి తెలుసుకున్నారు. ఇరిగేషన్ శాఖ అన్నారం ఈఈ యాదగిరి వారికి వివరాలు వెల్లడించారు. బ్యారేజీ పిల్లర్ల కింద 2020లోనే తొలిసారి నీటి బుంగలు ఏర్పడ్డాయని ఐఐటీ ఫ్రొఫెసర్ల సూచనలతో వాటిని అరికట్టామని ఈఈ చెప్పారు. ఆ తర్వాత టీమ్మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన గేట్ల వద్దకు వెళ్లి పరిశీలించింది. బ్యారేజీ లో కుంగిన 7 వ బ్లాక్ కు చేరుకొని పిల్లర్లన్నింటిని తనిఖీ చేశారు. కుంగడానికి కారణాలను ఇరిగేషన్ ఈఈ తిరుపతి రావును అడిగి తెలుసుకున్నారు. డిజైన్ ప్రకారమే బ్యారేజీ కట్టారా? నాసీరకం పనుల వల్ల ఇలా జరిగిందా? నిర్వహణాపరమైన లోపాలు ఏమైనా ఉన్నాయా? వంటి ప్రశ్నలు వేశారు.