
చెన్నై: టీవీకే పార్టీ అధినేత, నటుడు విజయ్ ఎన్నికల ర్యాలీలో జరిగిన తొక్కిసలాట మృతుల కుటుంబాలకు టీవీకే పార్టీ ఎక్స్గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.20లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్లు తెలిపింది. క్షతగాత్రులకు రూ.2 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని వెల్లడించింది. బాధితులకు అండగా ఉంటామని పేర్కొంది. ఈ ఘటన దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేసింది. కాగా, తొక్కిసలాట మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించిన విషయం తెలిసిందే.
కాగా, ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం (సెప్టెంబర్ 27) రాత్రి కరూర్ జిల్లా కేంద్రంలో టీవీకే అధినేత విజయ్ కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్కు జనం, విజయ్ అభిమానులు భారీగా తరలివచ్చారు. పోలీసుల నుంచి పర్మిషన్ 10 వేల మందికి తీసుకుంటే ఈ సమావేశానికి దాదాపు 50 వేల మంది హాజరైనట్లు సమాచారం. దీంతో జనం రద్దీ ఎక్కువై తొక్కి సలాట జరిగింది. ఈ ఘటనలో 39 మంది మృతి చెందగా.. మరికొందరు గాయపడ్డారు. 11 మందికి ఐసీయూలో ట్రీట్మెంట్ అందిస్తు్న్నారు.
మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారు. తొక్కిసలాట ఘటనపై తమిళనాడు ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. రిటైర్డ్ హైకోర్టు జడ్జి అరుణ జగదీశన్ నేతృత్వంలో ఏక సభ్య కమిషన్ ర్పాటు చేసింది. ఈ కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. మరోవైపు.. తొక్కిసలాటకు బాధ్యులుగా టీవీకే పార్టీ జనరల్ సెక్రటరీ ఆనంద్, జాయింట్ సెక్రటరీ నిర్మల్ కుమార్, కరూర్ జిల్లా టీవీకే పార్టీ కార్యదర్శిపై పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు.
.