
ముంబై: బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా , నీరవ్ మోదీ, మొహుల్ చోక్సీలను ఉద్దేశించి ముంబై స్పెషల్ కోర్టు కీలక కామెంట్లు చేసింది. దర్యాప్తు సంస్థల నిర్లక్ష్యం వల్లే మాల్యా, నీరవ్, చోక్సీ విదేశాలకు పారిపోయారని అభిప్రాయపడింది. ఓ మనీలాండరింగ్ కేసులో నిందితుడిగా ఉన్న వ్యోమేశ్ షా విదేశాలకు వెళ్లేందుకు తన బెయిల్ షరతును సవరించాలని కోరుతూ కోర్టులో పిటిషన్ వేశాడు. దాన్ని ప్రత్యేక న్యాయమూర్తి ఎంజీ.దేశ్పాండే సోమవారం విచారించారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) వాదిస్తూ.. విదేశాలకు వెళ్లేందుకు వ్యోమేశ్ షాకు అనుమతిస్తే నీరవ్ మోదీ, విజయ్ మాల్యా, మెహుల్ చోక్సీ వంటి పరిస్థితులు తలెత్తుతాయని కోర్టుకు తెలిపింది.
దర్యాప్తు సంస్థ వాదనపై అసంతృప్తి వ్యక్తం చేసిన కోర్టు..మాల్యా, నీరవ్, చోక్సీలను సరైన టైంలో అరెస్టు చేయడంలో సంబంధిత దర్యాప్తు సంస్థల వైఫల్యం ఉందని తెలిపింది. కోర్టు పంపిన సమన్లకు వ్యోమేశ్ షా ప్రతిస్పందించారని.. బెయిల్ కూడా పొందారని గుర్తుచేసింది. విదేశాలకు వెళ్లడానికి ఆయన చాలాసార్లు దరఖాస్తు చేసుకున్నారని వివరించింది. మాల్యా, నీరవ్, చోక్సీ తదితరుల కేసులతో వ్యోమేశ్ షా కేసును పోల్చలేమని తేల్చిచెప్పింది. వ్యోమేశ్ షా విదేశాలకు వెళ్లేందుకు అనుమతిస్తున్నట్లు కోర్టు పేర్కొంది.