తిరుమల తరహాలో దుర్గమ్మ ప్రసాదాల తయారీ.. ఇంద్రకీలాద్రి అధికారుల సన్నాహాలు..

తిరుమల తరహాలో దుర్గమ్మ ప్రసాదాల తయారీ.. ఇంద్రకీలాద్రి అధికారుల సన్నాహాలు..

తిరుమల తరహాలో దుర్గమ్మ ప్రసాదాలు తయారు చేసేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు ఇంద్రకీలాద్రి అధికారులు. ఈ క్రమంలో గురువారం ( జనవరి 29 ) తిరుమలలో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు ఇంద్రకీలాద్రి అధికారులు. ​విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో భక్తులకు అందించే ప్రసాదాలు, అన్నప్రసాదం నాణ్యతను మరింత పెంచేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. దేవదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి, కమిషనర్ శ్రీ కె. రామచంద్ర మోహన్ ఆదేశాల మేరకు, ఆలయ ఈఓ శ్రీ వి.కె. శీనా నాయక్ నేతృత్వంలోని అధికారుల బృందం నేడు తిరుమల క్షేత్రాన్ని సందర్శించింది.

​ఈ క్రమంలో దుర్గ గుడి ఈఓ శీనా నాయక్, తిరుమల అదనపు ఈఓ శ్రీ వెంకయ్య చౌదరిని కలిసి దుర్గమ్మ వారి ప్రసాదాన్ని అందజేశారు.
​ తిరుమల ప్రధాన పోటు (లడ్డూ తయారీ కేంద్రం)ను సందర్శించి, అక్కడ ప్రసాదం తయారీకి ఉపయోగిస్తున్న అత్యాధునిక యంత్రాలు, ముడిపదార్థాల నాణ్యత, తయారీ విధానాలను క్షుణ్ణంగా పరిశీలించారు.

​అన్నప్రసాద వితరణ

భక్తుల రద్దీకి అనుగుణంగా అన్నప్రసాదం తయారీ, భోజనశాల విస్తీర్ణం, ఒక్కో బంతికి ఎంతమంది కూర్చుంటున్నారు, వడ్డన, భక్తులు భోజనం ముగించే సమయం వంటి సాంకేతిక అంశాలను అడిగి తెలుసుకున్నారు ఈవో శీనా నాయక్.

​ఇంజనీరింగ్ వివరాలు

తిరుమలలో అన్నప్రసాద భవన నిర్మాణం, యంత్రాల పనితీరుపై సమగ్ర సమాచారాన్ని తిరుమల ఇంజనీరింగ్ అధికారులు  విజయవాడ బృందానికి వివరించారు.​త్వరలోనే తిరుమల తరహాలో అధునాతన సాంకేతికతతో ఇంద్రకీలాద్రిపై భక్తులకు రుచికరమైన, నాణ్యమైన ప్రసాదాలు అందించేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు శీనా నాయక్.

►ALSO READ | ఫిబ్రవరి 11 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. 14న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న పయ్యావుల కేశవ్