జోసఫ్ విజయ్ కొత్త తమిళ జాతీయ వాదం

జోసఫ్ విజయ్ కొత్త తమిళ జాతీయ వాదం

తమిళనాడులో జోసఫ్​ విజయ్​ గెలవడం ఇప్పుడున్న బీజేపీ, ఆర్ఎస్ఎస్ హిందూ రాష్ట్ర నిర్మాణ దశలో ఒక కొత్త మలుపు అని చెప్పాలి. జోసఫ్​ అనే పేరు బైబిల్​ పునాదిగా వచ్చింది. అది జీసెస్​ క్రీస్తు తండ్రి పేరు కూడా. జీసెస్​ ఆయన కన్న కొడుకు కాకపోయినా జోసఫ్​ ఆయనను హైరోడ్​ అనే రోమన్​ పాలకుడు చంపకుండా కాపాడటానికి ఈజిప్టుకు  తీసుకువెళ్లాడు. కొడుకును, తల్లి మేరీని రక్షించాడు. తరువాత ఆయన జీసెస్​కి  రాయడం, చదవడం, వడ్రంగి పని నేర్పించాడు. ఆ జోసఫ్​ పేరునే తమిళ విజయ్​కి ఆయన తల్లిదండ్రులు పెట్టారు. ఆ జోసఫ్​ ఇప్పుడు ఆ క్రిస్టియన్​ పేరుగల మొదటి ముఖ్యమంత్రి అయ్యాడు.

జోసఫ్​విజయ్​ గెలుపు..  భారతదేశంలో  క్రైస్తవులంతా  జాతివ్యతిరేకులనే  పద్ధతిలో  కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తున్న దశలో కొద్దిమంది మాత్రమే  క్రిస్టియన్లు ఉన్న ఒక పెద్ద రాష్ట్రమైన తమిళనాడుకు ముఖ్యమంత్రి  కావడం ఆశ్చర్యదాయకమైనదే.  ద్రవిడ స్థాన్గా ఎదిగిన పెరియార్​ భూమి మాత్రమే ఈ మార్పు తేగలదు.  అయితే,  జోసఫ్​ విజయ్​ తన సిద్ధాంత ప్రచారానికి ఎన్నుకున్న  సింబల్స్​  తమిళ జాతీయవాదాన్ని మరో మలుపు తిప్పాయి.  ఆయన ఎన్నుకున్న సింబల్స్​లో  ముగ్గురు పురుషులు, ఇద్దరు స్త్రీలు ఉన్నారు.  పురుషుల్లో  డా.బీఆర్​ అంబేద్కర్, పెరియార్​ రామస్వామి నాయకర్,  కామరాజ్​ నాడర్​ ఉండగా స్త్రీలలో తమిళులను  ఒకనాడు  పరిపాలించిన రాణి వేలు నాచియార్, స్వాతంత్ర్య పోరాట యోధురాలు అంజలీ అమ్మల్​ ఉన్నారు.

ఈ  స్త్రీ, పురుష ఐకాన్ల ఎన్నిక తమిళ స్త్రీలను ప్రభావితం చేసి ఉంటుంది.  దేశస్థాయిలో  ఎన్నికల రంగంలో  కాంగ్రెస్​ పార్టీ ఉపయోగించిన ఒక ఇందిరాగాంధీ ఇమేజ్​ తప్ప మనం మళ్లీ  స్త్రీ ఐకాన్​ బొమ్మను చూడం. ఈ ఐదుగురిలో ఎవరూ కూడా క్రిస్టియన్​ కాదు. కానీ, పెరియార్​ద్రవిడ కజగం స్థాపించిన దగ్గర నుంచి జోసఫ్​ ముఖ్యమంత్రి అయ్యేవరకు అంబేద్కర్,  పెరియార్​, కామరాజ్​ బొమ్మలను ఆ ఇద్దరి స్త్రీ మూర్తులతో  జతకట్టి తమిళ జాతీయవాదాన్ని ఇంకో కొత్తరూపంలోకి మార్చింది మాత్రం జోసఫ్​ విజయ్​ మాత్రమే. అతను  గుడులకూ, మసీదులకూ వెళ్లినా మోకాళ్ల మీద పాకి అతి వినయ క్రిస్టి యన్​గా  దేవుడిని చర్చిలో మాత్రమే ప్రార్థించాడు.

స్వాతంత్ర్యం వచ్చిన  దగ్గర నుంచి  ఒక  ప్రాంతీయ పార్టీ పెట్టుకుని కాశ్మీర్​లో మాత్రమే ఒక ముస్లిం ముఖ్యమంత్రి కాగా చూశాం.  ఒక  ప్రాంతీయ పార్టీ పెట్టుకుని ఒక పెద్ద రాష్ట్రంలో  జోసఫ్​ విజయ్​లాగ  ఒక దళిత  క్రిస్టియన్​ ముఖ్యమంత్రవడం  చూడలేదు.  అందులోనూ  ఆయన  ఇప్పటికే దేశమంతటికి బాగా పరిచయమున్న  ముగ్గురు  ఉద్యమ నాయకులను,  సిద్ధాంతకర్తలను  ఒక దగ్గర చేర్చి  ద్రవిడ జాతీయవాదులను, ఆ జాతీయవాదంలో తమకు స్థానం లేదని  చాలాకాలంగా మదనపడుతున్న దళితులను,  ఈ ఇద్దరికి మధ్యస్థంగా ఉండి  స్వాతంత్ర్యోద్యమ  కాంగ్రెస్​  అభిమానులను  మెప్పించాడు జోసఫ్.

తమిళ అంబేద్కర్​ వాదం
తమిళనాడులో  ఒక బలమైన  దళిత  మిడిల్​ క్లాస్​ఉన్నది నిజమే.  వాళ్లు  పెరియార్​ను  కొంత  అభిమానించినా  చాలా బలమైన అంబేద్కర్​వాదులుగా  మారారు.  అన్నాదురై  పాలనకాలం నుంచి కరుణానిధి,  ఎంజీఆర్​ పాలన వరకూ  తాము  దళితులుగా చూడబడుతున్నామని అక్కడి దళిత మేధావులు వాదిస్తున్నారు. ఈ వాదన  నుంచి తిరుమావలవన్​ ఒక దళిత పార్టీ  స్థాపించాడు కానీ అది  దళితయేతరుల్లో  ఆదరణ  పొందలేదు.

కామరాజ్​వల్ల కాంగ్రెస్​ మనుగడ
తమిళనాడులో  ఇంకా  కాంగ్రెస్​ బతికుందంటే  కామరాజ్​ నాడర్​ ఒక జాతీయ నాయకుడిగా, ఒక జాతీయస్థాయి కింగ్ మేకర్​గా, ఒక వెల్ఫేర్​ ఆర్థిక, విద్యా వ్యవస్థ వ్యవస్థాపకుడిగా  కామరాజ్​కు ఎనలేని గౌరవం.  ఆ రాష్ట్రంలోనూ, దేశంలోనూ ఉంది.   కానీ, కాంగ్రెస్​ పార్టీ ఆయనకు  జాతీయస్థాయిలో  ఆ స్థానం కలిపించలేదు. ఆయన ఫొటో  దేశస్థాయిలో చూడలేదు. 

కామరాజ్,  చక్రవర్తి  రాజగోపాలాచారి  కాంగ్రెస్​లో  రెండు పూర్తిగా భిన్నమైన  ఆలోచనలకు  ప్రాతినిధ్యం వహించారు. రాజగోపాలాచారి  బాగా  బ్రాహ్మణవాది. పెరియార్​కు బద్ధ శత్రువు. అందుకే  కాంగ్రెస్​  ఆయన్ని మొదటి  గవర్నర్​ జనరల్​గా,  
ఆ రాష్ట్ర  ముఖ్యమంత్రిగా  పదవులిచ్చి  మొదటి భారతరత్న  అవార్డును కూడా ఆయనకే  ఇచ్చి గౌరవించింది.

రాజగోపాలాచారి  గాంధీకి  సన్నిహితుడేకాక  వియ్యంకుడు. అందుకే  నెహ్రూ ఆయన చెప్పినవన్నీ చేశారు.  తమిళ బ్రాహ్మణులను మొత్తం కేంద్ర ఉద్యోగాల్లో నింపాడు.  ఆ చరిత్ర  బ్యాక్​గ్రౌండులోనే  ఈనాటికి తమిళ బ్రాహ్మణులు (అయ్యర్లు, అయ్యంగార్లు) అన్ని రాష్ట్రాల్లో ఉద్యోగ ఆధిక్యతలో ఉన్నారు.  తెలంగాణ కులగణనలో  తేలిన లెక్కల ప్రకారం అయ్యర్లు, అయ్యంగార్లు  ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల్లో చాలా ఎక్కువగా ఉన్నారు.

కామరాజ్​ నాడార్​ మాత్రం తమిళ శూద్ర, దళిత  విద్య,  ఆర్థిక అభివృద్ధికి  ఎనలేని  ప్రాధాన్యతనిచ్చిన వ్యక్తి.  ఆయన  ఒక్క కులం కోసం పనిచేయలేదు.  అందుకే  కామరాజ్​కు  తమిళ ప్రజల్లో ఈనాటికీ  ఎనలేని  గౌరవం ఉంది.  ఇది  గమనించే జోసఫ్​ విజయ్​ అంబేద్కర్​ను,  కామరాజ్​ను,  పెరియార్​ పక్కన చేర్చాడు. ఆ ముగ్గురి పక్కన ఇద్దరి  స్త్రీ  ఐకాన్​లను  చేర్చాడు. 

పెరియార్ ​కొత్త రూపం
జోసఫ్​ విజయ్​ రాజకీయ సిద్ధాంత టీమ్​ చాలా  తెలివైనదని ఈ  ఐదుగురిని  సింబలైజ్​ చేయడం ద్వారా అర్థమౌతూనే ఉంది.  అయితే,  నిజానికి  జోసఫ్​ దైవ నమ్మక  వ్యక్తిత్వానికి,   సినిమాలు బాగా ఆడటానికి అలవర్చుకున్న అన్ని  మతాల  ఆచారాలను  నటించైనా చూపించడానికి  రాజకీయంగా  హేతువాదైన  పెరియార్​ను  తన సిద్ధాంతంలో ఇముడ్చుకోవడానికి చాలా తేడా ఉంది.  పెరియార్​ విగ్రహాల వద్ద ‘దేరీజ్​ నో గాడ్’ అని  మూడుసార్లు రిపీట్​ చేస్తూ రాసి ఉంటుంది. ఆ పెరియార్​ను  ఒక హేతువాద,  మతవాది అయిన  అంబేద్కర్,  సాధారణ  మత  నమ్మకస్తుడై  కామరాజ్​తో  జత  చేశారు జోసఫ్.

పెరియార్​దేవుడిని నమ్మడు  కాని నేను నమ్ముతానని ప్రకటించాడు. ఈ ఐదుగురి ఫొటోలను జోడించి  ఒక బలమైన వెల్ఫేర్​ఎజెండాను  కూడా జోసఫ్​ విజయ్​ ప్రజల ముందు ఉంచాడు.  తమిళనాడులో శూద్రులందరూ ఓబీసీలుగా నమోదై ఉన్నారు. అందులో ముదలియార్లు,  గౌండర్లు,  నాయకర్లు  కూడా ఉన్నారు.  ఇటువంటి కులాలు  ఇతర  రాష్ట్రాల్లో  రిజర్వేషన్​  బయట ఉన్నాయి. కానీ, అక్కడ బ్రాహ్మణులు శెట్టియార్లు మినహా అన్ని కులాల రిజర్వేషన్లలో ఉన్నారు.  అయితే, జోసఫ్​ బ్రాహ్మణులను కూడా తన  క్యాంపేన్​లోకి తెచ్చుకున్నాడు.  అలా చేస్తూనే స్ట్రాంగ్​ యాంటీ  బీజేపీ, ఆర్ఎస్ఎస్  స్టాండ్​ తీసుకున్నాడు. ఇది అక్కడున్న  ద్రవిడ హేతువాదులను, క్రిస్టియన్లను, దళితులను ఆయన ఓటుబ్యాంకులోకి తెచ్చింది. ఇక్కడే క్రియేటివిటీ కనిపించింది.

డబ్బు పంచకుండా గెలుపు
డీఎంకే, అన్నాడీఎంకే, బీజేపీ, కాంగ్రెస్​ డబ్బు పంచాయి అని వార్తలొచ్చాయి. కానీ, జోసఫ్​ ఒక్క రూపాయి కూడా ఓటర్లకు ఇవ్వలేదట. అయినా ఓటర్లు ఆయనకు ఓటు వేశారంటే ఈ దేశంలో డెమోక్రసీ మనుగడ మీద మనందరికీ  ఒక కొత్త  ఆశ  కలుగుతుంది. పంచేవారుంటే, తీసుకునేవారు ఉంటారు. కానీ, తీసుకునేవారిని పైసా ఇవ్వను కానీ నాకు ఓటు వేయండి అని ఒప్పించి ఓట్లు వేయించుకోవడం ఈ రోజుల్లో మామూలు విషయం కాదు. అట్లని ఆయన బీదవారు అని కాదు. రూ.600 కోట్లు తనకు బ్యాంకుల్లో ఉన్నాయని ఆయన అఫిడవిట్లోనే  చెప్పాడు.

అయినా  మాకు ఎందుకు ఇవ్వవు అని  ప్రజలు అడగలేదంటే  తమిళనాడులో  ఒక కొత్త గాలి వీచినట్లే.  జోసఫ్​కు  పూర్తిస్థాయి మెజారిటీ లేదు గనుక ఆయన  ప్రభుత్వం ఐదేండ్లు  మనగలుగుతుందా?  ఇచ్చిన హామీలు కొన్ని అయినా నెరవేరుస్తుందా? అనేవి భవిష్యత్తుకు సంబంధించిన ప్రశ్నలు.  కానీ జోసఫ్​ విజయ్​ ఉపయోగించిన  రాజకీయ  నిర్మాణ  ఎత్తుగడలు  గతంలో సినిమా యాక్టర్లుగా ఎంజీఆర్,  ఎన్టీఆర్,  జయలలిత  ఉపయోగించినవాటికంటే చాలా భిన్నమైనవి.

ఇది పరిమిత ఎక్స్పర్మెంట్
జోసఫ్​  విజయ్​ది తమిళనాడుకు పరిమితమైన ఎక్స్​పర్​మెంట్. కానీ  దేశ  రాజకీయాల్లో ఒక  కొత్తగాలిలా  కనిపించింది.  ఆయన క్రిస్టియన్​ అని తెలిసి కూడా క్రిస్టియనేతరులు ఆయనకు పెద్ద ఎత్తున ఓటు వేశారు. అందుకు క్రిస్టియానిటీ, ఇస్లామ్​లా కాక  ప్రజలందరిరీ విద్య, మెడిసిన్​ రంగాలలో ఆదుకున్న సంస్థలు నడిపిన చరిత్ర ఉంది.  దేశంలోనే  మొట్టమొదటి  గొప్ప అలోపతి  హాస్పిటల్​ అయిన క్రిస్టియన్​ మెడికల్​ కాలేజీ హాస్పిటల్​  తమిళనాడులోని వెల్లూరులో  ప్రారంభమైంది.

దేశంలో చాలా కొత్త, కొత్త ఆపరేషన్లు ఆ ఆసుపత్రిలో వేలాది  మంది క్రిస్టియనేతరులకు జరిగాయి. లయోలా వంటి  గొప్ప  విద్యాసంస్థలు కూడా మద్రాసులోనే ప్రారంభమయ్యాయి. అందువలనే అంటరానితనాన్ని తీవ్రంగా అనుభవించిన నాడార్లు సైతం  క్రిస్టియానిటీని తీసుకున్నారు. ఆ రాష్ట్రంలో ఒక దళిత  క్రిస్టియన్,  బాగా  ఇంగ్లిష్​లో చదువుకున్న యువ నాయకుడు ఎదగడం ఒక ఆశను రేకెత్తించింది.

ప్రొ. కంచ ఐలయ్య షఫర్డ్

  • ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ఐడీ openpage@v6velugu.com
  • రచయితలు ‘వెలుగు’కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి.
  • స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.