
వికారాబాద్, వెలుగు: దివ్యాంగులు జీవనోపాధి పొందేందుకు ప్రభుత్వం ఉపాధి, పునరావాస పథకాన్ని అమలు చేస్తున్నదని వికారాబాద్ జిల్లా సంక్షేమ శాఖ అధికారిణి కృష్ణవేణి తెలిపారు. ఈ పథకం కింద జిల్లాకు బ్యాంకు లింకేజీ లేకుండా రూ.50 వేలతో 22 యూనిట్లు, బ్యాంకు లింకేజీతో రూ.లక్ష, రూ.2 లక్షలు, రూ.3 లక్షలతో ఒక్కో యూనిట్ మంజూరు అయ్యాయని పేర్కొన్నారు. అభ్యర్థులు కనీసం 40 శాతం వైకల్యంతో 21 నుంచి-55 ఏండ్ల వయస్సు మధ్య ఉండాలని, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షల వార్షిక ఆదాయం ఉండాలని తెలిపారు.
అర్హులు ఈ నెల 14 నుంచి 31 వరకు వెబ్సైట్లో దరఖాస్తు చేయాలని సూచించారు. సదరం సర్టిఫికేట్, ఆధార్, ఆదాయ, కులం, నివాస, వయస్సు ధ్రువీకరణ పత్రాలు, విద్యార్హత సర్టిఫికెట్లు, పాస్పోర్ట్ ఫొటో జతచేయాలని సూచించారు. లబ్ధిదారుల ఎంపిక ఆన్లైన్లో జరుగుతుందని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.