
- ధరలు ఎక్కువగా ఉండటమే కారణం
- 5జీ కనెక్టివిటీ లేక ఈ ఫోన్లకు దూరం
- రీచార్జ్లు మాత్రం తగ్గడం లేదు
- భారీగా డేటా వాడకం వెల్లడించిన ఐడీసీ స్టడీ
న్యూఢిల్లీ: పల్లెటూరోళ్లు ఫోన్ల కొనుగోలుకు దూరంగా ఉంటున్నారు. ఉన్నవాటితో సరిపెట్టుకుంటున్నారు. అవసరమైతే ఫీచర్ ఫోన్లు కొంటున్నారు. ధరలు పెరుగుతుండటమే ఇందుకు కారణం. చిన్న పట్టణాలు, గ్రామాలలో స్మార్ట్ఫోన్ అమ్మకాలు 2021 మధ్యకాలం నుండి పెద్దగా పెరగడం లేదు. సేల్స్ 35–-40శాతం దాటడం లేదు. ధరలు పెరగడంతోపాటు 5జీ టెక్నాలజీ పెద్దగా అందుబాటులో లేకపోవడం ఇందుకు కారణాలు. రూరల్ డిమాండ్ తగ్గిపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో స్మార్ట్ఫోన్ అమ్మకాలు మందగించాయని రెండు స్టడీల్లో తేలింది. మెట్రో నగరాలకే ఇప్పటికీ స్మార్ట్ఫోన్ అమ్మకాల్లో మెజారిటీ వాటా ఉంది. ధరలు పెరుగుతున్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో డేటా వినియోగం మాత్రం తగ్గడం లేదు. 2022లో అమ్ముడైన 122 మిలియన్ల స్మార్ట్ఫోన్లలో 35–-40శాతం ఫోన్లను గ్రామీణ భారతీయులు కొన్నారని పరిశోధనా సంస్థ ఐడీసీ ఇండియా తెలిపింది. 2023 మొదటి క్వార్టర్లో ఈ వాటానిలకడగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో 24 మిలియన్ల స్మార్ట్ఫోన్లు అమ్ముడయ్యాయి. మొత్తం అమ్మకాలలో ఇవి 37.2శాతం మాత్రమే. ఈ ఏడాది జనవరి–-మార్చి క్వార్టర్లో దేశంలో అమ్ముడైన ప్రతి పది 5జీ స్మార్ట్ఫోన్లలో కేవలం మూడు మాత్రమే గ్రామీణ భారతదేశం నుంచి ఉన్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఐడీసీ ఇండియా అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ నవ్కేందర్ సింగ్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా గ్రామీణ-పట్టణ విభజన ఒకేలా లేనప్పటికీ, గ్రామీణ ప్రాంతాల నుంచి వాటా 2021 మధ్యకాలం వరకు పెరిగిందని, మొత్తం అమ్మకాలలో 35-–40శాతం వద్ద నిలిచిపోయాయని అన్నారు. మహారాష్ట్రలోని ముంబై–-నాసిక్ హైవే వెంబడి గ్రామాలలో ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ సర్వే చేసింది. పెరుగుతున్న ధరల వల్లే స్మార్ట్ఫోన్లను కొనడం లేదని అక్కడి జనం చెప్పారు. గ్రామాల్లో రూ.10 వేలు–15 వేల మధ్య ధర కలిగిన ఫోన్లకు గిరాకీ కాస్త ఫర్వాలేదు. 2018, 2019లో అమ్మకాలు బాగా నమోదయ్యాయి, కానీ ఇప్పుడు తగ్గుముఖం పట్టాయి.
ఫీచర్ ఫోన్లకు గిరాకీ
ప్రధాన నగరాలకు ఆనుకుని ఉన్న రూరల్సబర్బన్ ప్రాంతాల్లో ఇప్పటికీ 2జీ, 4జీ ఫీచర్ ఫోన్లకు డిమాండ్ ఉంది. 4జీ స్మార్ట్ఫోన్ల ధరలు ఎక్కువగా ఉండటం, ఫీచర్ ఫోన్లను ఉపయోగించడం సులువు కావడం ఇందుకు కారణాలు. పైగా వీటిలో బ్యాటరీ ఎక్కువ సేపు పనిచేస్తుందని, చదువుకోని ప్రజానీకం, ముఖ్యంగా ఆడవారు స్మార్ట్ఫోన్లను ఉపయోగించడం చాలా కష్టమని సింగ్ చెప్పారు. తక్కువ ధరే ఉన్నందున జియో 4జీ ఫీచర్ఫోన్కు గిరాకీ బాగుంది. నగరాల్లో 5జీ స్మార్ట్ఫోన్ల కోసం పెరుగుతున్న డిమాండ్ వల్ల వీటి ధరలు పెరిగాయి. 2023 మొదటి క్వార్టర్లో 5జీ స్మార్ట్ఫోన్లు మొత్తం షిప్మెంట్లలో 45శాతం ఉండగా, అంతకుముందు క్వార్టర్లో వీటి వాటా 35శాతం ఉంది. ముంబై వంటి ప్రాంతాల్లో ఫైనాన్సింగ్ పథకాలు అందుబాటులోకి రావడంతో స్మార్ట్ఫోన్ ధరలు పెరుగుతున్నాయి. గ్రామాల్లో 5జీ నెట్వర్క్లు లేకపోవడంతో 5జీ హ్యాండ్సెట్లకు గిరాకీ పెరగడం లేదు. అయితే డేటా డేటా వినియోగం తగ్గడం లేదు. మెజారిటీ గ్రామీణ వినియోగదారులు రోజుకు 1.5జీబీ డేటాను టారిఫ్ ప్లాన్లు కొంటున్నారు. యూట్యూబ్, ఐపీఎల్, సోషల్ మీడియా ఎక్కువగా చూస్తున్నారు.