మెదక్ జిల్లా- గ్రామంలోని ఓ వ్యక్తి చనిపోతే అంత్యక్రియలు చేయడానికి బంధువులెవ్వరూ ముందుకు రాకపోవడంతో.. ఆ గ్రామ సర్పంచ్ అంత్యక్రియలు నిర్వహించి మంచి మనసు చాటారు. ఈ సంఘటన మంగళవారం మెదక్ జిల్లాలో జరిగింది. శివ్వంపేట మండలం, గుండ్లపల్లి గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తి మంగళవారం చనిపోయాడు. అయితే కరోనా సోకిందనే అనుమానంతో బంధువులు, గ్రామస్థులు ఎవరూ అంత్యక్రియలు చేసేందుకు ముందుకు రాలేదు.
గ్రామానికి చెందిన అడ్వకేట్ బాలాజీ కరోనా సోకడంతో.. సూరారం నారాయణ హాస్పిటలో పది రోజులుగా ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాడు. గ్రామంలో ఉండే అతని తల్లిదండ్రులు గత వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండగా, బాలాజీ తండ్రి రామస్వామి మంగళవారం మృతి చెందాడు. అయితే ఆయనకు కూడా కరోన సోకిందనే అనుమానంతో ఎవ్వరు దగ్గరకు కూడా రాలేదు. అతని అంత్యక్రియలు చేయడానికి బంధువులు కూడా ముందుకు రాకపోవడంతో, హాస్పిటల్లో ఉన్న కొడుకు బాలాజీ ఫోన్చేసి తన తండ్రి అంతక్రియలు చేయమని కోరడంతో.. గ్రామ సర్పంచ్ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ గొర్రె వెంకట్ రెడ్డి ముందుకు వచ్చి, రామస్వామి అంత్యక్రియలు నిర్వహించి గొప్ప మనసు చాటుకున్నారు.