మాస్టారి పదవీ విరమణని వేడుకలా జరిపిన విద్యార్థులు

మాస్టారి పదవీ విరమణని వేడుకలా జరిపిన విద్యార్థులు
మాస్టారు..మాస్టారు.. మా మంచి మాస్టారు ఎడ్లబండిపై డప్పుల చప్పుళ్లతో ఊరేగిస్తూ తీసుకెళ్తున్న ఈ వ్యక్తి పేరు సోమనర్సయ్య. మహబూబాబాద్ లోని ఇనుగర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలుగు మాస్టారిగా పనిచేస్తూ ఈ మధ్యే రిటైరయ్యారు. ఇన్నాళ్లు తమకి పాఠాలు చెప్పిన మాస్టారి పదవీ విరమణని ఓ వేడుకలా సెలబ్రేట్ చేశారు స్టూడెంట్స్.  మహబూబాబాద్‌‌, వెలుగు: శ్రద్ధ చూపకపోతే ఎంతో మంది విద్యార్థులను బెత్తం దెబ్బలతో మందలించాడు…  వారు ఎదిగితే ఉప్పొంగిపోయాడు. డీలాపడితే తాను కూడా నిరుత్సాహపడ్డాడు… చదువు విలువను విడమర్చి చెప్పాడు. జీవిత పాఠాలు విపులంగా నేర్పించాడు. అలాంటి మాస్టారు రిటైర్​ అవుతుంటే విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంటుంది. తమకు జీవితాన్నిచ్చిన టీచర్ కు పూలమాలల సత్కారంతో సరిపెడితే ఎలా? అందుకే ఈ స్కూల్​ విద్యార్థులు తమ​ మాస్టారి పదవీ విరమణని ఇలా డిఫరెంట్​గా ప్లాన్​ చేశారు. డప్పుల చప్పుళ్లతో, ఎడ్లబండి మీద ఊరేగిస్తూ మాస్టారికి ఘనంగా వీడ్కోలు చెప్పారు. పదవీ విరమణని  ఓ మరపురాని గుర్తుగా మార్చారు. ఆ ఆలోచన రావడమే ఆలస్యం తెలుగుదనం ఉట్టిపడేలా కొబ్బరి మట్టలతో ఎడ్లబండిని అందంగా ముస్తాబు చేశారు. డప్పుల చప్పుళ్లతో మాస్టారి పదవీ విరమణని ఓ పండుగలా సెలబ్రేట్ చేశారు. ఈ  పండుగకి ఊరంతా కదిలి రావడం మరో విశేషం. విద్యార్థులతోపాటు గ్రామస్తులు తనపై చూపిస్తున్న  ప్రేమ  చూసి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు మాస్టారు. పిల్లలు కూడా  మాస్టారు లేని స్కూల్​ని ఊహించుకోలేమంటూ బాధపడ్డారు. ఈ గురు శిష్యుల అనుబంధం చూసి అందరూ మెచ్చుకుంటున్నారు. జీవితానికి ఇది చాలు పాతికేళ్లుగా తెలుగు పాఠాలు చెప్తున్నా… ఎనిమిదేళ్లుగా ఇనుగుర్తిలో పనిచేస్తున్నా… నా టీచింగ్ ప్రొఫెషన్​లో ఎంతోమంది విద్యార్థులను చూశా… ఓ మాస్టారిగా నా విద్యార్థుల జీవితం​ బాగుండాలని ప్రతి నిమిషం ఆలోచిస్తుంటా… అందుకోసం నేను ఏం చేయగలనో అదే చేశా… జీవితంలో  ఎలా మెలగాలో నేర్పా… నీతి, నిజాయితీలు జీవితంలో ఎంత ముఖ్యమో చెప్పా… కానీ, ఇకనుంచి నేను పాఠాలు చెప్పాలనుకున్నా వినడానికి నా స్టూడెంట్స్​​ ఉండరు… అది తలుచుకుంటే  బాధగా ఉంది.. కానీ, వీళ్లు చూపిస్తున్న అభిమానం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది… ఈ రిటైర్​మెంట్ వేడుక నా జీవితంలో ఎప్పటికీ ఓ తీపి జ్ఞాపకంగా మిగిలిపోతుంది. పంజాల సోమనర్సయ్య, రిటైర్డ్‌‌ తెలుగు ఉపాధ్యాయుడు.