బీహార్లోని గయా జిల్లాలోని బుధౌల్ గ్రామం నుంచి మరో గ్రామానికి వెళ్లాలంటే 15 కిలోమీటర్ల దూరం చుట్టు తిరిగి వెళ్లాలి. అదే ఒక నదిని దాటితే కేవలం 1 కిలోమీటర్ దూరం మాత్రమే ఉంటుంది. అందుకే ఆ గ్రామ ప్రజలు 30 ఏళ్లుగా నదిపై వంతెన కోసం ప్రభుత్వాలకు, అధికారులకు మొరపెట్టుకుంటున్నారు. కానీ వారి గోడును మాత్రం ఏ ప్రభుత్వమూ, ఏ అధికారి పట్టించుకోలేదు. గ్రామంలో ఎవరికైనా ఏదైనా అనారోగ్య సమస్య వస్తే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నది దాటి వెళ్లేవారు. ఆ నదిని దాటుతూ ఇప్పటికే ఇద్దరు చిన్నారులు సహా ఓ వృద్ధురాలు చనిపోయింది.
అయితే గత ఏళ్లుగా ప్రభుత్వాలు మారాయి తప్ప వారి తలరాత మారలేదు. దాంతో ఊరంతా కలిసి తామే బ్రిడ్జి కట్టుకోవాలని నిర్ణయించుకున్నారు. ‘ఇటీవల పంచాయతీ సమావేశం నిర్వహించి వంతెనను పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. గ్రామస్తులు అందరూ చందాలు వేసుకున్నారు. చందాలు ఇవ్వని వారు బ్రిడ్జి నిర్మాణంలో కార్మికులుగా సాయం చేస్తున్నారు’ అని స్థానిక సామాజిక కార్యకర్త చిత్రంజన్ కుమార్ తెలిపారు.
For More News..