దారులు బంద్.. వందలాది గ్రామాల్లో పొలిమేరలను మూసేసిన గ్రామస్థులు

దారులు బంద్.. వందలాది గ్రామాల్లో పొలిమేరలను మూసేసిన గ్రామస్థులు

‘టీఎస్​ ప్రభుత్వం సూచనల మేరకు మా గ్రామస్థులమంతా స్వచ్ఛందంగా గృహ నిర్బంధంలో ఉన్నాం.. బయట వ్యక్తులకు ప్రవేశం లేదు..’ మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం బొక్కలగుట్టలోకి ప్రవేశించే చోట అంటించిన నోటీసు సారాంశమిది. సరిహద్దులో కట్టెలతో స్పెషల్​ చెక్​పోస్టు ఏర్పాటు చేసుకున్న గ్రామస్థులు, అక్కడ 24 గంటల కాపలా కొనసాగిస్తూ, కొత్త వ్యక్తులను ఎవరినీ గ్రామంలోకి రానివ్వడం లేదు. అత్యవసరమైతే తప్ప గ్రామస్థులను బయటకు వెళ్లనివ్వడం లేదు. ఇది ఒక్క బొక్కలగుట్ట పరిస్థితి మాత్రమే కాదు, కరోనా పాజిటివ్​ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వందలాది గ్రామాలు ఇలా తమ బార్డర్లను మూసేసుకుంటున్నాయి.

సెల్ప్​ క్వారంటైన్​.. సోషల్​ డిస్టాన్స్​..

బోర్డర్లను మూసేసుకుంటున్న గ్రామాల్లో మారుమూల పల్లెలే ముందుంటున్నాయి. పట్టణ ప్రజలతో పోలిస్తే సెల్ఫ్​క్వారంటైన్​లోనూ, సోషల్​ డిస్టాన్స్​ పాటించడంలోనూ గ్రామీణుల్లోనే ఎక్కువ చైతన్యం కనిపిస్తోంది. రాష్ట్రంలో కరోనా స్టేజ్​–1లో ఉన్నప్పుడే  సర్పంచులు, కార్యదర్శులు ముందస్తుగా అన్ని గ్రామాల్లోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డప్పుచాటింపు ద్వారా ప్రచారం చేయించారు. రేషన్​షాపులు, కిరాణాల వద్ద, కూరగాయల మార్కెట్లలో సోషల్​ డిస్టెన్స్​ పాటిస్తున్నారు. కాగా, సోమ, మంగళవారాల్లో వందలాది గ్రామాల్లో జనం ఊరి పొలిమేరలను మూసేశారు. కట్టెలు, చెట్లు, ముళ్ల పొదలు, ఎడ్లబండ్లు ఏది దొరికితే అది దారులకు అడ్డంగా నిలిపి, ‘మా ఊళ్లోకి రాకపోకలు నిషేధం’ అంటూ బోర్డులు పెట్టేశారు.

అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి..

ఉమ్మడి ఆదిలాబాద్‌‌‌‌ జిల్లా వ్యాప్తంగా సుమారు 200కు  పైగా గ్రామాలు బారికేడ్లు కట్టి స్వీయ నిర్బంధం విధించుకున్నాయి. ప్రధానంగా మహారాష్ట్రతో సరిహద్దుగల గ్రామాలు మరీ అప్రమత్తంగా ఉన్నాయి. ఆయా పొలిమేరల్లో గిరిజనులు 24 గంటలు కాపలా కాస్తూ కొత్తవారిని, ప్రధానంగా మహారాష్ట్ర నుంచి ఎవరినీ రాకుండా చూసుకుంటున్నారు. ఉమ్మడి మెదక్​జిల్లా వ్యాప్తంగా  305  గ్రామాలు సరిహద్దులను మూసేశాయి. సంగారెడ్డి జిల్లాలో దాదాపు 220 గ్రామాలు, మెదక్ జిల్లాలో సుమారు 50 గ్రామాలు,  సిద్దిపేట జిల్లాలో 35 గ్రామ పంచాయతీలు స్వీయ నిర్బంధంలోకి వెళ్లాయి.  ఉమ్మడి మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌లోని సుమారు 35 గ్రామాలు స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయాయి. చాలా గ్రామాల్లో బారికేడ్లు పెట్టగా,  కేటి దొడ్డి మండలం సల్కాపురం గ్రామస్తులు ఏకంగా జేసీబీతో రోడ్డుకు అడ్డంగా పెద్ద గొయ్యి తవ్వి ఎవరినీ రాకుండా చేసేశారు.  మానవపాడు మండలం కేంద్రాన్ని కూడా దిగ్బంధించడం గమనార్హం. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 423గ్రామాలు లాక్​డౌన్​లోకి వెళ్లిపోయాయి.  గ్రామాల్లోకి వచ్చే అన్ని రోడ్లపై ముళ్లకంపలు, చెట్లు, రాళ్లు వేసి మూసేశారు. యాదాద్రి, నల్గొండ జిల్లాలను కలిపే నార్కట్ పల్లి మండలం అమ్మనబోలులోని మూసీ వంతెనను సైతం బ్లాక్ చేశారు.

ఉమ్మడి కరీంనగర్​ జిల్లాలో సుమారు 320 గ్రామాలు సెల్ఫ్​ క్వారంటైన్​లోకి వెళ్లాయి. చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామంలో ఎవరైనా అనవసరంగా విధుల్లో తిరిగితే పంచాయతీ ఆధ్వర్యంలో రూ.100 జరిమానా విధిస్తున్నారు.  షాపులు, హోటళ్లు ఉదయం 9 గంటల వరకే అనుమతిస్తున్నారు. ఆతర్వాత మూసివేయకపోతే రూ.వెయ్యి జరిమానా వేస్తున్నారు. చొప్పదండి మండలం దేశాయిపేటలోకి ఎవరూ రాకుండా ట్రాక్టర్లు అడ్డంగా నిలిపివేశారు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండల కేంద్రానికి కొత్త వ్యక్తులు వస్తే  రూ.500 జరిమానా విధిస్తున్నారు. ఉమ్మడి వరంగల్​ జిల్లాలోని100కు పైగా గ్రామాలు లాక్​డౌన్​లోకి వెళ్లాయి.  జయశంకర్‌‌‌‌‌‌‌‌ భూపాలపల్లి, ములుగు జిల్లాలలోని అటవీ గ్రామాల్లోని 50కి పైగా పంచాయతీల్లో కంచెలు ఏర్పాటు చేసుకొని కొత్తవారెవరూ రాకుండా చూసుకుంటున్నారు.  అత్యవసర పనులపై వస్తే  ఏఎన్​ఎం, ఆశావర్కర్ల ఆధ్వర్యంలో టెస్టులుచేశాకే అనుమతిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని దాదాపు 200కు పైగా గ్రామాల్లో రోడ్లకు అడ్డంగా కంచెలు ఏర్పాటు చేశారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలంలో పలు గ్రామాలు శివారుల్లో ముళ్ల కంచెలు వేశారు. మేడ్చల్ మండలంలోని రాజాబొల్లారం తండా, శామీర్​పేట మండల పరిధిలోని నాగిశెట్టిపల్లి గ్రామ శివారులను మూసేశారు. కరోనా కంట్రోల్​ అయ్యే వరకూ బయటి వాళ్లకు ప్రవేశం లేదని  గ్రామస్తులు
చెబుతున్నారు.

గ్రామాన్ని కాపాడుకోవడం మా బాధ్యత

హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలను పంతంగి టోల్ గేట్ వద్ద పోలీసులు అడ్డుకోవడంతో చాలా మంది మా గ్రామం నుంచి చిట్యాల, నార్కట్ పల్లికి వెళ్తున్నారు. దీంతో ఇతర వ్యక్తులు ఎవరూ మా గ్రామం నుంచి వెళ్లకుండా, కరోనా వైరస్ మా ఊరికి రావొద్దనే ఉద్దేశంతో కృష్టాపురం, గుండ్రాంపల్లి, వెలిమినేడు గ్రామాలకు వెళ్లే రోడ్లను మూసివేశాం.

– పాలెం మాధవి మల్లేష్, సర్పంచ్, ఏపూర్, నల్గొండ జిల్లా

మా గ్రామానికి రావద్దు

అయ్యా దయచేసి మా ఊరికి రావద్దు.. మాకు కరోనాను అంటించ వద్దు. మా గ్రామ ప్రజలను కాపాడుకునే బాధ్యత నాపై ఉంది. నాకు ఓట్లేసి గెలిపించిన ప్రజల కంటికి రెప్పలా కాపాడుకుంటా. అందుకోసమే మా గ్రామ పొలిమెరల్లో ఎవరూ రాకుండా కంచెలు ఏర్పాటు చేశా. గ్రామ పంచాయతీ సిబ్బందిని, యువతను కాపలాగా పెట్టా. గ్రామ పంచాయతీ సిబ్బందికి, నాకు తెలియకుండా ఒక్కరు కూడా ఊళ్లో అడుగుపెట్టకుండా చూసుకుంటున్నా.

– కాటవేన రాజక్క, రాపల్లికోట సర్పంచ్, భూపాలపల్లి జిల్లా