
యాదగిరిగుట్ట, వెలుగు: వలిగొండ మండలం కేర్చిపల్లికి ఆర్టీసీ బస్సులను పునరుద్ధరించాలని గ్రామస్తులు డిమాండ్చేశారు. ఈ మేరకు బుధవారం యాదగిరిగుట్టలోని డీఎం కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. మాజీ సర్పంచ్ మద్దెల మంజుల మాట్లాడుతూ.. కేర్చిపల్లికి గతంలో 2 బస్సులు నడిచేవన్నారు. ఏడాదిన్నరగా వాటిని నిలిపివేశారని తెలిపారు. దీంతో స్కూళ్లు, కాలేజీలకు వెళ్లేందుకు విద్యార్థులు, పనిమీద ఇతర గ్రామాలకు వెళ్లేందుకు గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎమ్మెల్సీ హామీతో ధర్నా విరమణ
కేర్చిల్లికి చెందిన ఓ వ్యక్తి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు ఫోన్ చేసి, సమస్యను తెలిపాడు. స్పందించిన ఆయన యాదగిరిగుట్ట డిపో మేనేజర్ మురళీకృష్ణకు ఫోన్ చేసి, మాట్లాడారు. జులై ఒకటి నుంచి నడిపిస్తామని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని ఎమ్మెల్సీ గ్రామస్తులకు ఫోన్ లో చెప్పారు. ఒకవేళ సమస్య పరిష్కారం కాకుంటే తానే వస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.