
న్యూఢిల్లీ: తాను సాధించిన మేజర్ ధ్యాన్చంద్ ఖేల్రత్న, అర్జున అవార్డులను స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ వెనక్కి ఇచ్చేసింది. శనివారం తన అవార్డులను తిరిగి ఇవ్వడానికి వినేశ్ ప్రధాని కార్యాలయానికి చేరుకోవడానికి ప్రయత్నించింది. కానీ పోలీసులు మధ్యలోనే ఆమెను అడ్డుకున్నారు. దీంతో నిరసనగా తన రెండు అవార్డులను కర్తవ్య పథ్లో వదిలేసి వచ్చింది.
తర్వాత వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డబ్ల్యూఎఫ్ఐ చీఫ్గా సంజయ్ సింగ్ ఎన్నిక కావడంపై నిరసన వ్యక్తం చేసిన వినేశ్ అవార్డులను తిరిగి ఇచ్చేస్తానని గతంలోనే ప్రకటించింది. మరోవైపు దేశంలో రెజ్లింగ్ కార్యకలాపాలను మొదలుపెట్టాలని బజ్రంగ్ పూనియా.. సెంట్రల్ స్పోర్ట్స్ మినిస్ట్రీని కోరాడు.
వచ్చే ఏడాది పారిస్ ఒలింపిక్స్ ఉన్న నేపథ్యంలో రెజ్లర్లు ఎవరూ ప్రిపరేషన్స్ను సీరియస్గా తీసుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశాడు. గత ఏడు నెలలుగా కుంటుపడిన రెజ్లింగ్ టోర్నీలను వెంటనే గాడిలో పెట్టి ప్లేయర్ల కెరీర్ను కాపాడాలని బజ్రంగ్ మినిస్ట్రీని అభ్యర్థించాడు.