యాదాద్రి జిల్లాలో విజృంభిస్తున్న విష జ్వరాలు

యాదాద్రి జిల్లాలో విజృంభిస్తున్న  విష జ్వరాలు

అవసరం లేకున్నా టెస్టులు చేస్తూ దోచుకుంటున్న ప్రైవేటు డాక్టర్లు

యాదాద్రి, వెలుగు: యాదాద్రి జిల్లాలో విజృంభిస్తున్న విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. దవాఖానాకు పోతే ప్రైవేట్​ఆస్పత్రులు, ల్యాబ్​ నిర్వాహకులు జేబులు గుల్ల చేస్తున్నారు.  ఇదే అదును అన్నట్లు టెస్టుల మీద టెస్టులు చేసి దోచుకుంటున్నారు. రోజుకు రూ. 20 లక్షల బిజినెస్​ చేసుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి.   ప్రతి ఇంటిలో ఒకరు లేదా ఇద్దరు జ్వరాల బారిన పడుతుండడంతో  పీహెచ్​సీ, సీహెచ్​సీలతో పాటు ప్రైవేట్​ హాస్పిటల్స్​కు ఓపీ తాకిడి పెరిగింది. వందల సంఖ్యలో రోగులు ట్రీట్​మెంట్​కోసం క్యూ కడుతున్నారు. సీహెచ్​సీ  సెంటర్లలో రోజుకు 200 నుంచి 300 వరకు జ్వర బాధితులు వస్తుంటే.. భువనగిరిలోని ఏరియా హాస్పిటల్​కు వచ్చే వారి సంఖ్య 500 దాటుతోంది. హాస్పిటల్స్​లో బెడ్స్​ నిండిపోతున్నాయి. రోగులకు జ్వర తీవ్రత తగ్గగానే.. వారిని డిశ్చార్జ్​ చేస్తూ వేరే పేషెంట్​కు బెడ్​ కేటాయిస్తున్నారు. 

టెస్టుల మీద టెస్టులు..

యాదాద్రి జిల్లాపై ప్రస్తుతం టైపాయిడ్​ పంజా విసురుతోంది. దీనికి తోడు డెంగీ డేంజర్​ బెల్స్​ మోగిస్తోంది. ప్రభుత్వ హాస్పిటల్స్​లో కొన్ని రకాల టెస్టులు చేస్తున్నప్పటికీ.. సీబీపీ వంటివి ప్రైవేట్​కు సిఫారసు చేస్తున్నారు. అయినప్పటికీ.. ఏరియా హాస్పిటల్​లో రోజుకు వంద, సీహెచ్​సీ సెంటర్లలో దాదాపు 30 నుంచి 50 వరకు చేస్తున్నారు. రోగుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ప్రైవేట్​ హాస్పిటల్స్​లో తాకిడి పెరిగింది. జ్వరంతో హాస్పిటల్​కు వచ్చిన రోగికి వ్యాధి నిర్దారణ పేరుతో డాక్టర్లు టెస్టులు రాస్తున్నారు. ఒక్కొక్కరికి టైపాయిడ్​, మలేరియా, సీబీపీ , కంప్లీట్​ యూరిన్​, సహా  మొత్తం ఆరు రకాల  టెస్టులు రాస్తున్నారు. ఈ టెస్టులకు రూ.1,000 నుంచి 1,200 వరకు వసూలు చేస్తున్నారు. ఒక్కో ల్యాబ్​లో రోజుకు 50 వరకు టెస్టులు చేయించుకుంటున్నారు. ఈ విధంగా జిల్లాలోని 50కి పైగా ఉన్న ల్యాబ్​ల  నిర్వాహకులు జేబులు నింపుకుంటున్నారు. యావరేజ్​గా రోజుకు 2వేల టెస్టులు లెక్కేసినా దాదాపు  రూ. 20 లక్షలు బిజినెస్​ చేసుకుంటున్నారు. పైగా డెంగీ పేరుతో చేసే టెస్టులు అదనం. ఒక్కో రాపిడ్​ టెస్ట్​కే రూ. 750 నుంచి రూ. 1,000 వసూలు చేస్తున్నారు.  
ల్యాబ్​ నిర్వాహకుల టెస్టుల దోపిడీ తెలిసినా.. తమకెందుకులే అన్నట్టుగా హెల్త్​ డిపార్ట్​మెంట్​స్టాఫ్​ ప్రేక్షకుల్లా వ్యవహరిస్తున్నారు. 

డెంగీ  కలకలం 

యాదాద్రి జిల్లాలో డెంగీ కలకలం మొదలైంది. గడిచిన రెండేండ్లలో కేసుల సంఖ్య ఎక్కువగానే ఉంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి గత నెల 20 వరకూ  ఐదు కేసులు   నమోదు అయ్యాయి. తాజాగా గడిచిన 10 రోజుల్లో జిల్లాలోని 9 పీహెచ్​సీ ల పరిధిలో 10 కేసులు నమోదయ్యాయి. వీరిలో స్టేజ్–​ 2లో ఐదుగురు ఉన్నట్టు తెలుస్తోంది.  వాస్తవానికి డెంగీ నిర్దారణ టెస్టు యాదాద్రి జిల్లా గవర్నమెంట్​హాస్పిటల్స్​లో లేదు. ఇక్కడి నుంచి శాంపిల్స్​ సేకరించి హైదరాబాద్​కు పంపించడం, అక్కడ ఎలీషా టెస్టు చేయించిన తర్వాతే అది డెంగీయా.? కాదా.? అన్నది తేలుతుంది. ఈ కారణంగా ఎక్కువ మంది ప్రైవేట్​ హాస్పిటల్స్​ నిర్వాహకులను ఆశ్రయిస్తూ వారి ద్వారా రాపిడ్​ టెస్టులు చేయించుకుంటున్నారు. రూ. 250 తో టెస్ట్​ చేయాల్సి ఉండగా రాపిడ్​ టెస్ట్​కే రూ. 750 నుంచి వెయ్యి వరకు వసూలు చేస్తున్నారు. రాపిడ్​టెస్ట్​తో డెంగీ నిర్ధారణ ప్రామాణికం కాకున్నా , డెంగీ 
పేరుతో ట్రీట్​మెంట్​కు ప్రైవేట్ హాస్పిటల్స్​ ట్రీట్​మెంట్​ కూడా చేస్తున్నారు. ఇక టైపాయిడ్​ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. విష జ్వరాలపై ప్రజలకు అవగాహన కల్పించి అలర్ట్​చేయాల్సిన హెల్త్​ డిపార్ట్​మెంట్ కేసుల సంఖ్యను దాచి, అంతా బాగుందన్నట్లుగా వ్యవహరిస్తోంది. 

వెయ్యి రూపాయలు తీసుకున్నరు..

జ్వరంతో ప్రైవేట్​ హాస్పిటల్​కు వెళ్లాను. డాక్టర్​ ఆరు రకాల టెస్టులు రాశారు. ల్యాబ్​కు వెళ్లగానే.. బ్లడ్, యూరిన్ శాంపిల్స్​ తీసుకొని రూ. 1,200 బిల్లు చెప్పాడు. బతిమిలాడితే 1,000 తీసుకున్నాడు. 

– శ్రీనివాస్​, భువనగిరి