IND vs SA: కోహ్లీ, రోహిత్ అదుర్స్: బహుమతులతో ఎల్గర్‍కు ఘనంగా వీడ్కోలు

IND vs SA: కోహ్లీ, రోహిత్ అదుర్స్: బహుమతులతో ఎల్గర్‍కు ఘనంగా వీడ్కోలు

భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య టెస్ట్ సిరీస్ 1-1 తో డ్రాగా ముగిసింది. తొలి టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఘోర పరాజయం చవి చూస్తే..  తాజాగా కేప్ టౌన్ లో జరిగిన రెండో టెస్టులో భారత్ అంతకుమించిన ఘన విజయాన్ని అందుకుంది. టెస్ట్ సిరీస్ సంగతి పక్కన పెడితే దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డీన్ ఎల్గర్ ఈ సిరీస్ తో తన అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని ఈ సిరీస్ కు ముందు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. నేడు చివరి టెస్టు ఆడిన ఎల్గర్ కు భారత స్టార్ ప్లేయర్లు కోహ్లీ, రోహిత్ గిఫ్ట్ లతో ఎల్గర్ కు గుడ్ బై చెప్పారు. 

మ్యాచ్ అనంతరం కోహ్లీ తన ఆటోగ్రాఫ్ చేసిన జెర్సీని ఎల్గర్ కు బహూకరించాడు. ఈ మ్యాచ్ లో ఎల్గర్ ఔటైన తర్వాత ఎల్గర్ డగౌట్ కు తిరిగి వెళుతున్నప్పుడు అత్యుత్తమ వీడ్కోలు లభించాలని చేతులు రెండు వంచి నమస్కరించాలని అతను ప్రేక్షకులను కోరాడు. క్యాచ్ పట్టిన తర్వాత సెలబ్రేషన్ చేసుకొని కోహ్లీ.. అందరి మనసులను గెలుచుకున్నాడు. ప్రెజెంటేషన్ సమయంలో భారత ఆటగాళ్లు ఆటోగ్రాఫ్ చేసిన జెర్సీని రోహిత్.. ఎల్గర్ కు అందజేశాడు. తన కెరీర్ లో అంతా మంచి జరగాలని శుభాకాంక్షలు తెలిపాడు. 

సెంచూరియన్ లో జరిగిన తొలి టెస్టుమ్యాచ్ లో 185 పరుగులు చేసి భారత ఓటమికి కారణమైన ఎల్గర్.. కేప్ టౌన్ లో జరిగిన తన చివరి టెస్ట్ మ్యాచ్ లో మాత్రం విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్ లో 4 పరుగులు చేసి సిరాజ్ బౌలింగ్ లో ఔటైన ఈ స్టార్ ఓపెనర్.. రెండో ఇన్నింగ్స్ లో 12 పరుగులు చేసి ముఖేష్ కుమార్ కు తన వికెట్ ను సమర్పించుకున్నాడు.  

టెస్ట్ స్పెషలిస్ట్ గా జట్టులో స్థానాన్ని స్థిరం చేసుకున్న ఈ 36 ఏళ్ళ బ్యాటర్.. దక్షిణాఫ్రికా తరఫున 84 టెస్టుల్లో 37.28 సగటుతో 5146 పరుగులు చేశాడు. 13 సెంచరీలు, 23 హాఫ్ సెంచరీలు ఎల్గర్ ఖాతాలో ఉన్నాయి. ఇక 8 వన్డేలు మాత్రమే ఆడిన ఈ స్టార్ ఓపెనర్ కేవలం 104 పరుగులు మాత్రమే చేసి జట్టులో స్థానం కోల్పోయాడు. చివరి టెస్టులో బవుమా గాయంతో అనూహ్యంగా కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన ఎల్గర్..బ్యాటర్ గా, కెప్టెన్ గా విఫలమయ్యాడు. అయితే చివరి సిరీస్ లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గెలుచుకొని తన కెరీర్ కు గొప్ప వీడ్కోలు పలికాడు.