
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సొంతగడ్డపై తన 200వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడనున్నాడు. ఇవాళ్టి నుంచి ఇండోర్లో ఆస్ట్రేలియాతో జరగబోయే మూడో టెస్టు కోహ్లీకి స్వదేశంలో 200వ మ్యాచ్ కావడం విశేషం. స్వదేశంలో ఇప్పటివరకు 199 మ్యాచ్లు ఆడిన కోహ్లీ 58.22 సగటుతో 10,829 పరుగులు చేశాడు. అతను స్వదేశంలో 34 సెంచరీలు, 51 అర్ధ సెంచరీలు చేశాడు, ఇందులో అత్యుత్తమ స్కోరు 254(నాటౌట్)గా ఉంది. ఇక ఆసీస్ తో తొలి రెండు టెస్టుల్లో అంతగా ఆకట్టుకోలేకపోయిన కోహ్లీ మూడో టెస్టు మ్యాచ్ లోనైనా అదరగొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. కాగా కోహ్లీ టెస్టుల్లో సెంచరీ చేసి మూడేళ్లు కావొస్తుంది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే నాలుగు టెస్టుల సిరీస్లో భాగంగా బుధవారం ఇండోర్లో మొదలయ్యే మూడో టెస్టులో గెలిచి సొంత గడ్డపై వరుసగా16వ సిరీస్ అందుకోవడంతో పాటు జూన్లో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్కు క్వాలిఫై అవ్వాలని టీమిండియ చూస్తోంది. మరోవైపు రెండు మ్యాచ్ల్లోనూ తేలిపోయి, రెగ్యులర్ కెప్టెన్ కమిన్స్ సేవలు కోల్పోయిన ఆసీస్ ఈ టెస్టులో అయినా పుంజుకోవాలని కోరుకుంటోంది.