గువాహతి: 2022ని సెంచరీతో ముగించిన టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ 2023ని ఇంకో సెంచరీతో షురూ చేశాడు. డిసెంబర్లో బంగ్లాదేశ్పై వందతో మెరిసిన విరాట్ కోహ్లీ (87 బాల్స్లో 12 ఫోర్లు, 1 సిక్స్తో 113) మరోసారి పంజా విసిరాడు. క్లాసిక్ బ్యాటింగ్తో తన వన్డే కెరీర్లో 45వ సెంచరీతో చెలరేగాడు. అతనికి తోడు కెప్టెన్ రోహిత్ శర్మ (67 బాల్స్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 83), యంగ్ ఓపెనర్ శుభ్మన్ గిల్ (60 బాల్స్లో 11 ఫోర్లతో 70) కూడా రాణించడంతో మంగళవారం జరిగిన తొలి వన్డేలో ఇండియా 67 రన్స్ తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించింది. మూడు మ్యాచ్ల సిరీస్లో 1–0తో లీడ్లో నిలిచింది. టాస్ ఓడిన ఇండియా తొలుత 50 ఓవర్లలో 373/7 స్కోరు చేసింది. ఛేజింగ్లో లంక ఓవర్లన్నీ ఆడి 306/8 స్కోరుకే పరిమితం అయింది. కెప్టెన్ దసున్ షనక (88 బాల్స్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 108 నాటౌట్) సెంచరీ చేసినా ఫలితం లేకపోయింది. ఇండియా బౌలర్లలో ఉమ్రాన్ (3/57), సిరాజ్ (2/30) సత్తా చాటారు. కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. రెండో వన్డే కోల్కతాలో గురువారం జరుగుతుంది.
టాపార్డర్ తడాఖా
టాపార్డర్ తడాఖా చూపెట్టడంతో ఇండియా భారీ టార్గెట్ను నిర్దేశించింది. ఓపెనర్లు రోహిత్, గిల్ వేసిన పునాదిపై కోహ్లీ సూపర్ సెంచరీతో భారీ స్కోరు సాధించిపెట్టాడు. ఫామ్లో ఉన్న ఇషాన్, సూర్యను బెంచ్పై కూర్బోబెట్టి విమర్శలు ఎదుర్కొన్న రోహిత్ యంగ్స్టర్ గిల్తో జట్టుకు మంచి ఆరంభం అందించి సమాధానం చెప్పాడు. గిల్ సైతం అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఫ్లాట్ వికెట్పై ఈ ఇద్దరూ స్వేచ్ఛగా ఆడుతూ బౌండ్రీలు రాబట్టాడు. ఈ క్రమంలో రోహిత్ 41 బాల్స్లో, గిల్ 51 బాల్స్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నారు. వీళ్ల జోరుకు 15 ఓవర్లకే స్కోరు వంద దాటింది. ఎట్టకేలకు 20వ ఓవర్లో గిల్ను ఎల్బీ చేసిన షనక ఫస్ట్ వికెట్కు 143 రన్స్ పార్ట్నర్షిప్ బ్రేక్ చేశాడు.సెంచరీ చేసేలా కనిపించిన హిట్మ్యాన్ నాలుగు ఓవర్ల తర్వాత మదుషంక బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. వరుసగా రెండు వికెట్లు పడటంతో ఇండియా జోరు తగ్గింది. ఈ టైమ్లో కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (28) వేగం పెంచే ప్రయత్నం చేశారు. హసరంగ బౌలింగ్లో అయ్యర్ సిక్స్తో అలరించాడు. కానీ, శుభారంభాన్ని సద్వినియోగం చేసుకోలేక 30వ ఓవర్లో ధనంజయ డిసిల్వ బౌలింగ్లో స్వీప్ షాట్కు ట్రై చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత విరాట్కు.. కేఎల్ రాహుల్ (39) కొద్దిసేపు సపోర్ట్ ఇచ్చాడు. కోహ్లీతో నాలుగో వికెట్కు 90 రన్స్ జోడించడంతో 41 ఓవర్లకే స్కోరు 300 దాటింది. ఫామ్ కోల్పోయి విమర్శలు ఎదుర్కొంటున్న కేఎల్ మంచి ఆరంభమే దక్కించుకున్నా.. భారీ స్కోరు చేయలేకపోయాడు. కసున్ రాజిత స్లో బాల్కు బౌల్డ్ అవడంతో ఈ పార్ట్నర్షిప్ ముగిసింది. ఓ దశలో ఇండియా ఈజీగా 400 ప్లస్ స్కోరు చేస్తుందనిపించింది. కానీ, మిడిలార్డర్ బ్యాటర్లు హార్దిక్ పాండ్యా (14), అక్షర్ (9) నిరాశ పరిచారు. అయితే, ఓవైపు క్రమం తప్పకుండా వికెట్లు పడుతున్నా.. విరాట్ మాత్రం ధనాధన్ షాట్లతో అలరించాడు. 52, 81 స్కోర్లు వద్ద అతనిచ్చిన రెండు క్యాచ్లను లంక ఫీల్డర్లు డ్రాప్ చేశారు. దీన్ని సద్వినియోగం చేసుకున్న విరాట్ 80 బాల్స్లోనే సెంచరీ పూర్తి చేసుకొని జట్టుకు మంచి స్కోరు అందించాడు. లంక బౌలర్లలో కసున్ రాజిత 3 వికెట్లు తీశాడు.
సంక్షిప్త స్కోర్లు
ఇండియా: 50 ఓవర్లలో 373/7 (కోహ్లీ 113, రోహిత్ 83, గిల్ 70, కసున్ 3/88)
శ్రీలంక: 50 ఓవర్లలో 306/8 (షనక108 నాటౌట్, ఉమ్రాన్ 3/57, సిరాజ్ 2/30)
సచిన్ రికార్డు సమం
వన్డేల్లో కోహ్లీకి ఇది 45వ సెంచరీ. స్వదేశంలో 20వ వంద. దాంతో, వన్డేల్లో సొంతగడ్డపై ఎక్కువ సెంచరీలు చేసిన సచిన్ రికార్డును సమం చేశాడు. సచిన్ 20 సెంచరీలకు 160 ఇన్నింగ్స్లు తీసుకుంటే, కోహ్లీ 99 ఇన్నింగ్స్ల్లోనే ఈ మార్కు దాటాడు. లంకపై వన్డేల్లో కోహ్లీకి ఇది తొమ్మిదో సెంచరీ కావడం విశేషం.