గాంధీనగర్: ఐపీఎల్ 2026 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ నిలిచింది. ఆదివారం (మే 31) గుజరాత్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్ ఫైట్లో గుజరాత్ను చిత్తు చేసి వరుసగా రెండో సారి ఐపీఎల్ టైటిల్ ఎగరేసుకుపోయింది. ఆర్సీబీ విజయంలో ఆ జట్టు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. బౌలింగ్కు అనుకూలిస్తున్న పిచ్పై తన అనుభవాన్ని అంతా రంగరించి ఎంతో సంయమనంతో బ్యాటింగ్ చేశాడు. ఓపెనర్గా బరిలోకి దిగిన కోహ్లీ చివరి వరకు క్రీజులో ఉండి భారీ సిక్సర్తో మ్యాచ్ ముగించి ఆర్సీబీకి ఘన విజయాన్ని అందించాడు. కీలకమైన ఫైనల్ మ్యాచులో హాఫ్ సెంచరీ బాది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ అందుకున్నాడు.
ఐపీఎల్–19లో సమవుజ్జీల సమరం కాస్త ఏకపక్షమైంది. లీగ్ దశలో అత్యుత్తమ ప్రదర్శన చూపెట్టిన రెండు జట్ల మధ్య జరిగిన మెగా ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పైచేయి సాధించింది. ఛేజ్ మాస్టర్, కింగ్ విరాట్ కోహ్లీ (42 బాల్స్లో 9 ఫోర్లు, 3 సిక్స్లతో 75 నాటౌట్) క్లాసికల్ ఇన్నింగ్స్కు తోడు బౌలర్లందరూ సమష్టిగా రాణించడంతో.. ఆదివారం జరిగిన టైటిల్ ఫైట్లో బెంగళూరు 5 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్పై గెలిచి రెండోసారి టైటిల్ను సొంతం చేసుకుంది.
టాస్ ఓడిన గుజరాత్ 20 ఓవర్లలో 155/8 స్కోరు చేసింది. వాషింగ్టన్ సుందర్ (37 బాల్స్లో 5 ఫోర్లతో 50 నాటౌట్) టాప్ స్కోరర్. ఛేజింగ్లో బెంగళూరు 18వ ఓవర్లలో 161/5 స్కోరు చేసి నెగ్గింది. వెంకటేశ్ అయ్యర్ (16 బాల్స్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 32) మెరుగ్గా ఆడాడు. కోహ్లీకి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, వైభవ్ సూర్యవంశీకి ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి.
