
ఎనభైల్లో మారుమూల గ్రామమైన విరాటపాలెంలో ప్రతి వధువు తన పెళ్లి రోజున చనిపోతుంటుంది. దాన్నొక శాపంగా భావిస్తారు గ్రామస్థులు. ఆ నమ్మకం భయంగా, భయం నిశ్శబ్దంగా మారిపోతుంది. దాంతో అక్కడ వివాహాలు ఆపేస్తారు. మీనా అనే ఓ పోలీస్ కానిస్టేబుల్ ఆ గ్రామానికి వచ్చి ఆ రహస్యాన్ని ఛేదించే ప్రయత్నం చేస్తుంది. పెళ్లి కూతుర్ల మరణాల కేసు ఎలాంటి మలుపు తిరిగింది అనేది ‘విరాటపాలెం: పీసీ మీనా రిపోర్టింగ్’ వెబ్ సిరీస్ మిగతా కథ.
గతంలో ‘రెక్కీ’ లాంటి సీట్ ఎడ్జ్ వెబ్ సిరీస్ను అందించిన మేకర్స్ నుంచి ఈ సూపర్నేచురల్ థ్రిల్లర్ వస్తోంది. అభిజ్ఞ వూతలూరు, చరణ్ లక్కరాజు లీడ్ రోల్స్లో నటించిన ఈ సిరీస్కు కృష్ణ పోలూరు దర్శకుడు. సౌత్ ఇండియన్ స్క్రీన్స్ బ్యానర్పై శ్రీరామ్ నిర్మించారు. జూన్ 27 నుంచి జీ5లో ఇది స్ట్రీమింగ్ కానుంది. ‘‘ఇది కేవలం సూపర్ నేచురల్ థ్రిల్లర్ మాత్రమే కాదు.. భయం, సత్యం మధ్య జరిగే యుద్ధం. ఓ పవర్ఫుల్ మెసేజ్తో ఉత్కంఠ భరితంగా తెరకెక్కించాం’ అని మేకర్స్ తెలియజేశారు.