ఎల్బీ నగర్, వెలుగు: మీ కాలనీలకు ఎంపీ రేవంత్ రెడ్డి ఎప్పుడైనా వచ్చి మాట్లాడిండా.. కనీసం ఫోన్ చేస్తే స్పందిస్తాడా.. మీకు10 రోజులు సమయం ఇస్తున్నా.. మీరు రేవంత్ రెడ్డితో కనీసం ఫోన్లో మాట్లాడినా రూ. లక్ష బహుమతిగా ఇస్తా’ అని బీఆర్ఎస్ ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి అన్నారు. గెస్ట్ అప్పీయరెన్స్ అభ్యర్థులను దూరం పెట్టాలన్నారు. ఎల్బీనగర్ చింతలకుంటలోని ఓ గార్డెన్లో విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్యారాషూట్ లీడర్లను నమ్మొద్దని అన్నారు. ఎన్నికల ముందు వచ్చి తర్వాత పత్తా లేకుండా పోతారన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని కలిసికట్టుగా గెలిపిస్తే కనీసం ఇటు వైపు మొహం కూడా చూపించడం లేదన్నారు. కార్యక్రమంలో కార్య నిర్వహణ అధ్యక్షుడు సల్వాచారి, నియోజకవర్గ అధ్యక్షుడు పర్వతం శ్రీనివాసచారి, గౌరవ అధ్యక్షుడు రామాచారి, జగ్జీవన్ చారి, సత్యంచారి తదితరులు పాల్గొన్నారు.