
హీరోగా వరుస సినిమాలు చేస్తూనే, ఓటీటీ షో ద్వారానూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు విశ్వక్ సేన్. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ‘ఆహా’లో రానున్న ‘ఫ్యామిలీ ధమాకా’ షోకు హోస్ట్గా వ్యవహరిస్తున్నాడు. సెప్టెంబర్ 8 నుంచి ఈ షో స్ట్రీమింగ్ కానుంది. ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఈ షో నుంచి కొత్త ఎపిసోడ్ రానుందని మేకర్స్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో విశ్వక్ సేన్ మాట్లాడుతూ ‘ఫ్యామిలీ షోకు హోస్ట్గా చేయడం థ్రిల్లింగ్గా ఉంది.
ఈ షో ద్వారా ఎన్నో కుటుంబాలను కలవడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి ఎంటర్టైన్మెంట్ను ప్రేక్షకులకు అందించటానికి నేను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’ అన్నాడు. ఆహా కంటెంట్ హెడ్ వాసుదేవ్ కొప్పినేని, ఫ్రిమాంటల్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ఆరాధన బోలా పాల్గొన్నారు.