హైదరాబాద్, వెలుగు: రైతుబంధు పేరు చెప్పి ఓట్లేయించుకున్న కేసీఆర్.. ఇప్పుడు ఆ స్కీమ్ను తీసేసే కుట్ర చేస్తున్నారని మాజీ ఎంపీ, బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. చెప్పిన పంట వేస్తేనే రైతుబంధు ఇస్తామనడం కరెక్ట్ కాదని, ఏ పంట వేసినా రైతుబంధు ఇవ్వాలని శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ‘ఏ భూమిలో ఏ పంట వేయాలో సలహా ఇస్తే చాలు. చెప్పిన పంటే వేయాలని రైతులను ఇబ్బంది పెట్టొద్దు. ఈ స్కీమ్ పరిధి నుంచి చాలా మందిని తప్పించేందుకు కేసీఆర్ కొత్త నాటకం మొదలుపెట్టారు. ఇది రైతుల మేలుకోరే ప్రభుత్వం కాదు. రైతు వ్యతిరేక ప్రభుత్వం. రోజుకో ప్రకటనతో కేసీఆర్ రైతులను గందరగోళానికి గురి చేస్తున్నడు. కేవలం రైతుబంధు వస్తుందనే ఆశతోనే కేసీఆర్కు రైతులు ఓట్లేశారు. ఇప్పుడు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తే కచ్చితంగా తిరగబడతరు. వెంటనే రైతులకు క్షమాపణ చెప్పాలి’ అని వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేశారు. రైతు కూలీలకూ రైతుబంధు ఇవ్వాలని కోరారు.

