మంచిర్యాల, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీరింగ్ అద్భుతం కాదని, రాష్ట్ర ప్రజలకు శాపమని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు డాక్టర్ జి.వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. బ్యారేజీల బ్యాక్ వాటరే వరదలకు కారణమని, దాని వల్ల మంచిర్యాల, చెన్నూర్, మంథని పట్టణాలు, అనేక గ్రామాలు, లక్షల ఎకరాల్లో పంటలు మునిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు వల్లే వరదలు వస్తున్నాయని ప్రజలు నిలదీస్తారనే భయంతోనే కేసీఆర్ మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలకు రాలేదని, వరదల్లో సర్వం కోల్పోయిన కుటుంబాలను గాలికొదిలేశారని మండిపడ్డారు. గురువారం మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలో నిర్వహించిన బీజేపీ భరోసా బైక్ ర్యాలీకి వివేక్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్రావుతో కలిసి వేంపల్లిలో జెండా ఆవిష్కరించి ర్యాలీని ప్రారంభించారు. జులైలో వరదలకు ఇండ్లు మునిగిన కుటుంబాలను ఆయన పరామర్శించారు. పలు గ్రామాల్లో ప్రజలనుద్దేశించి వివేక్ మాట్లాడారు.
కుటుంబ పాలనతో జనం విసుగెత్తారు
కమీషన్ల కోసమే కేసీఆర్ కాళేశ్వరం కట్టాడని, దాంతో రాష్ట్రానికి రూ.లక్ష కోట్ల నష్టం జరిగిందని వివేక్ ఆరోపించారు. ఈ ప్రాజెక్టు ద్వారా కొత్తగా ఒక్క బొట్టు నీళ్లు ఇయ్యకుండానే రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం మోపారన్నారు. ఈ ప్రాజెక్టు కోసం తెచ్చిన అప్పులపై వడ్డీనే రూ.30 వేల కోట్లకు చేరిందని, రానున్న రోజుల్లో ఇది రాష్ట్రానికి పెద్ద గుదిబండలా మారనుందని అన్నారు. కేసీఆర్కు దమ్ము, ధైర్యం ఉంటే కాళేశ్వరం, మిషన్ భగీరథలో అవినీతిపై సీబీఐ ఎంక్వైరీకి సిద్ధం కావాలని సవాల్ విసిరారు. అవినీతి సొమ్ముతో ఓట్లు కొని గెలుస్తానని కేసీఆర్ అనుకుంటున్నారని, కానీ టీఆర్ఎస్ నిరంకుశ, కుటుంబ పాలనపై ప్రజలు విసుగెత్తిపోయారని అన్నారు.
సమస్యలు తెలుసుకుంటూ.. భరోసానిస్తూ..
బీజేపీ భరోసా యాత్రలో వివేక్, రఘునాథ్రావు ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, వారికి భరోసానిస్తూ ముందుకు సాగారు. వేంపల్లిలో గురువారం ఉదయం 11 గంటలకు మొదలైన యాత్ర రాత్రి 8 గంటలకు కర్ణమామిడిలో ముగిసింది. ముల్కల్ల, వాగొడ్డుపల్లి, గంగొడ్డుపల్లి, చందనాపూర్, నంనూర్, రాపల్లి, గుడిపేట, నర్సింగాపూర్, రాజేశ్వరపల్లి, హాజీపూర్, టీకనపల్లి, బుద్దిపల్లి, గొల్లపల్లి, పెద్దంపేట, దొనబండ, పడ్తనపల్లి, కొండపల్లి మీదుగా సాగింది. వివేక్ వెంకటస్వామి స్వయంగా బైక్ నడుపుతూ హుషారుగా ముందుకు సాగారు. గ్రామగ్రామానా బీజేపీ జెండా ఎగురవేశారు. పెద్దంపేట శివారులో పత్తి చేనులో పనులు చేస్తున్న మహిళా రైతులతో మాట్లాడారు. కల్లు మండువ వద్ద గౌడ కులస్తులతో ముచ్చటపెట్టారు. గుడిపేటలో రేషన్ షాపులో బియ్యం పోశారు. పలువురికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. యాత్రలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శులు ముల్కల్ల మల్లారెడ్డి, పొనుగోటి రంగారావు, జిల్లా ప్రధాన కార్యదర్శులు అందుగుల శ్రీనివాస్, మునిమంద రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతున్నది
ప్రధాని నరేంద్రమోడీ ప్రవేశపెట్టిన పథకాలతో రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి లబ్ధి జరుగుతోందని వివేక్ చెప్పారు. తెలంగాణలో టీఆర్ఎస్గ్రాఫ్ వేగంగా పడిపోతూ బీజేపీ గ్రాఫ్ పెరుగుతోందని, ఇప్పటికే బీజేపీకి 30 శాతానికిపైగా ఓటు బ్యాంక్ ఉందని అన్నారు. పేదలకు ఫ్రీ రేషన్ ఇస్తున్నందున రేషన్ షాపుల్లో మోడీ ఫొటో పెట్టాలంటే.. కల్వకుంట్ల కవిత గ్యాస్ సిలిండర్లపై ఆయన ఫొటో పెట్టాలనడం విడ్డూరంగా ఉందన్నారు. ఆ మాటకొస్తే మద్యం ధరలను విపరీతంగా పెంచినందుకు, ఢిల్లీ లిక్కర్ స్కాంలో కూరుకుపోయినందుకు కేసీఆర్, కవిత ఫొటోలను లిక్కర్ బాటిళ్లపై పెట్టాలని కామెంట్ చేశారు. కేంద్రం ఇంధన ధరలను లీటర్కు రూ.20 వరకు తగ్గించిందని, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పైసా తగ్గించకుండా ప్రజలపై భారం వేస్తోందన్నారు. టీఆర్ఎస్ను ఓడించే సత్తా బీజేపీకే ఉందని, వచ్చే ఎన్నికల్లో కేసీఆర్గద్దె దిగడం ఖాయమన్నారు.