కేసీఆర్.. కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లు గంగపాలు చేశాడు : వివేక్ వెంకటస్వామి

కేసీఆర్.. కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లు గంగపాలు చేశాడు : వివేక్ వెంకటస్వామి

కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో తెలంగాణ ప్రజల లక్ష కోట్ల డబ్బును గంగపాలు చేశాడని.. తన కుటుంబాన్ని బంగారం చేసుకున్నాడంటూ.. సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు చెన్నూరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి. తెలంగాణ వచ్చాక ఒక్క ఉద్యోగం అన్నా ఇచ్చాడా.. ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా యువకుల జీవితాలను నాశనం చేశాడంటూ కేసీఆర్ పై మండిపడ్డారాయన. ఎన్నిలక ప్రచారంలో భాగంగా చెన్నూరు మండలం దుగ్నేపల్లిలో ర్యాలీ నిర్వహించారు వివేక్ వెంకటస్వామి.

తనపై జరిగిన ఐటీ రెయిడ్స్ విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఏం తప్పు చేశానని ఐటీ అధికారులు సోదాలు చేశారు.. పన్నులు సక్రమంగా కడుతున్నందుకా అని ప్రశ్నించారాయన. ఓ రోజంతా ప్రచారం చేయకుండా.. ఇంట్లోనే నిర్బంధించారని.. పోలీసులతో హౌస్ అరెస్టు చేసి ప్రజలకు దూరం చేయాలనే కుట్ర పన్నారంటూ కేసీఆర్ పై విమర్శలు చేశారు వివేక్ వెంకటస్వామి. ప్రజలపై పన్నులు వేస్తూ.. ధరలు పెంచుతూ సామాన్యల నడ్డి విరుస్తుందంటూ బీజేపీపైనా మండిపడ్డారాయన. 

కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని.. ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుందని.. మంచి జరుగుతుందని.. అన్ని వర్గాలకు పథకాలు ఇవ్వటం జరుగుతుందని.. ప్రతి పేదవాడికి లబ్ధి జరుగుతుందని భరోసా ఇచ్చారు వివేక్ వెంకటస్వామి. చెన్నూరు నియోజకవర్గంలో స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయటంతోపాటు యువతకు భారీగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారాయన. వివేక్ వెంకటస్వామి ప్రచారానికి వేలాది జనం తరలివచ్చారు.