వ్యాపారాల్లో నష్టపోయిన వారిపై విగ్రహాల ముఠా టార్గెట్

వ్యాపారాల్లో నష్టపోయిన వారిపై విగ్రహాల ముఠా టార్గెట్
  • మహిమ గల విగ్రహాల పెట్టుకుంటే కష్టాలన్నీ పోతాయని మోసగిస్తున్న ముఠా 
  • అరెస్ట్ చేసిన విజయనగరం జిల్లా పోలీసులు

విజయనగరం: వ్యాపారాల్లో నష్టపోయిన వారిని టార్గెట్ చేస్తోంది ఓ విగ్రహాల ముఠా. మహిమ గల విగ్రహాలు పెట్టుకుంటే మీ వ్యాపారాలు బాగా జరుగుతాయని, కష్టాలన్నీ తొలగిపోతాయని మాయమాటలు చెప్పి మోసం చేస్తున్నారు. మొత్తం ఐదుగురు సభ్యుల ముఠాలో నలుగురిని విజయనగరం రూరల్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. మహిమగల విగ్రహాల అన్వేషణలో ఉన్న వారిని గుర్తించి.. వారే నిపుణులుగా పరిచయం చేసుకుంటూ.. వారి సభ్యుల ద్వారానే అమ్మించి మోసం చేస్తున్నారు. అయితే వీరి చేతిలో మోసపోయిన ఓ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ముఠాకు సంకెళ్లు పడ్డాయి. 
విజయనగరం జిల్లాకు చెందిన రాజనాల శ్రీనివాస్ రావు మరో స్నేహితుడు రొంగలి రామసత్యంతో కలసి  స్థానిక జిల్లా కేంద్రంలో గాయిత్రి బోర్ వెల్స్ నిర్వహిస్తున్నాడు. వీరిద్దరు కలసి తమ వద్ద పనిచేస్తున్న దివాకర్ కిరణ్ కుమార్,  పైడా వెంకట్ రావు, మరొక వ్యక్తి కలిపి ఐదుగురు సభ్యులుగా టీమ్ ను ఏర్పాటు చేసుకున్నారు. విగ్రహాల పిచ్చి ఎక్కువగా ఉన్న రాజనాల శ్రీనివాస్ రావు టీమ్ మొత్తాన్ని లీడ్ చేస్తున్నాడు. అడ్డదారిలో తొందరగా ధనవంతుడై పోవాలన్న అత్యాశతో మహిమ గల విగ్రహాల  అన్వేషణ చేసి దెబ్బతిన్నాడు. అత్యాశతో ఈస్ట్ ఇండియా పేరుతో ఉన్న ఒక పురాతన సిపాయి విగ్రహాన్ని కొనుగోలు కూడా చేసాడు. కానీ ఆ విగ్రహం తెచ్చుకున్న నాటి నుంచి వ్యాపారాల్లో మరిన్ని ఎక్కువ నష్టాలను రాజనాల చవి చూసాడట. దీంతో తను కొనుగోలు చేసిన రెండు వందల ఏళ్ల నాటి ఆ పురాతన విగ్రహాన్ని ఎవరికైనా అమ్మేయాలని ఆలోచనతో ముఠాను ఏర్పాటు చేసుకున్నాడు. తన స్నేహితుడు పైడా వెంకట్ రావును విగ్రహాల మహిమలు తెలిపే నిపుణుడిగా పలువురికి పరిచయం చేస్తూ వచ్చాడు. 
ఈ క్రమంలో ఈ ముఠాకి  మహిమ విగ్రహాల పిచ్చి కలిగిన నెల్లిమర్ల కి చెందిన కాళ్ళ మహేష్ అనే వ్యక్తి తారస పడ్డాడు. దీంతో ఆయన్ని ఎలాగో బురిడీ కొట్టించి మహిమ గల దేవతా విగ్రహం తమ ఉందని నమ్మించారు. మహేష్ వారి మాయ మాటలు నమ్మి దేవతా విగ్రహాన్ని రూ. 5 లక్షలు ధరకు కొనేందుకు సిద్ధపడ్డాడు. ముఠాతో ఒప్పందం కుదుర్చుకుని ఈ ఏడాది మే నెల 27న రూ. 20 వేలు అడ్వాన్స్ కూడా చెల్లించాడు. ఇక అటు తర్వాత మిగిలిన మొత్తం సొమ్మును సిద్ధం చేసుకుంటే విగ్రహం ఇస్తామని నమ్మించారు. ఆ క్రమంలో ఈ నెల 10న కాళ్ళ మహేష్ కి వీరు ఫోన్ చేసి రమ్మని చెప్పి, అతడికి దేవతా విగ్రహం బదులు సిపాయి విగ్రహం అప్ప చెప్పే ప్రయత్నం చేశారు. అయితే అందుకు అంగీకరించని మహేష్, తనకు మహిమ గల దేవతా విగ్రహమే కావాలని స్పష్టం చేశాడు. అయితే రాజనాల ముఠా చేతులెత్తేయడంతో తనను మోసం చేస్తోందని భావించి బాధితుడు మహేష్ పోలీసులకి పిర్యాదు చేసాడు.
కేసు నమోదు చేసుకున్న విజయనగరం రూరల్ పోలీసులు రెండు బృందాలను రంగంలోకి దించారు. ముఠా కోసం నిఘా పెట్టి ఆచూకీ కనుక్కున్నారు.  విగ్రహంతో పాటు నలుగురు నిందితులని అరెస్ట్ చేయగా పోలీసులను పసిగట్టిన మరొక ముద్దాయి పరార్ అయ్యాడు. నిందితులపై సెక్షన్ 420 కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ కేసు వివరాలను గురువారం డిఎస్పీ అనిల్ పులిపాటి జిల్లా పోలీస్ కార్యాలయంలో మీడియాకి వివరించారు. విగ్రహాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను పట్టుకోవడంలో శ్రమించిన రూరల్ సిఐ టి సత్య మంగవేణి, ఎస్సైలు అశోక్ కుమార్, పి నారాయణ రావు, ఏఎస్సై త్రినాద్ రావును డిఎస్పీ అభినందించారు.