
హైదరాబాద్, వెలుగు: విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ (వీఆర్వో) పోస్టులను రద్దు చేస్తుండటంతో వారందరినీ ఇతర డిపార్ట్మెంట్లలోకి ట్రాన్స్ఫర్ చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. ట్రాన్స్ఫర్ ఇష్టం లేకుంటే వీఆర్ఎస్ తీసుకోవచ్చని, రాజీనామా చేసుకోవచ్చని స్పష్టం చేశారు. ఇతర శాఖల్లోకి వెళ్లేవారికి సంబంధిత పేస్కేల్ ప్రకారం జీతాలు ఇస్తామని, దీనితో సర్కారుపై రెండు, మూడు వందల కోట్ల భారం పడుతుందని ప్రకటించారు. ఈ మేరకు బుధవారం అసెంబ్లీలో ‘అబాలిషన్ ఆఫ్ ది పోస్ట్స్ ఆఫ్ విలేజీ రెవెన్యూ ఆఫీసర్స్యాక్ట్–2020’ బిల్లును ప్రవేశపెట్టారు. గ్రామ స్థాయిలో రెవెన్యూ రికార్డుల నిర్వహణ కోసం వీఆర్వోలను నియమించారని.. ప్రస్తుతం రికార్డులన్నీ డిజిటలైజేషన్ చేయడంతో ఆ పోస్టు అవసరం లేనిదిగా మారిందని కేసీఆర్ చెప్పారు. ప్రజలను, ప్రజాప్రతినిధులను సంప్రదించే రద్దు నిర్ణయం తీసుకున్నామన్నరు. గెజిట్వచ్చే తేదీ నుంచే వీఆర్వో పోస్టులు రద్దవుతాయన్నారు. వారిని నాలుగు నెలల్లో ఏదైనా డిపార్ట్మెంట్లో సమాన కేడర్ లోకి ట్రాన్స్ ఫర్గానీ, విలీనం గానీ చేస్తామన్నారు. అందుకు ఇష్టం లేనివారు వీఆర్ఎస్గానీ, రిజైన్గానీ ఆప్షన్ ఎంచుకోవచ్చని తెలిపారు. ఈ చట్టం అమల్లో ఏదైనా ఇబ్బంది ఏర్పడితే.. దాన్ని తొలగించేందుకు సర్కారు ఆర్డర్ జారీ చేస్తుందన్నారు.