సామాన్య భక్తుడికే పెద్దపీట వేస్తున్నామని.. సామాన్య భక్తుడే తన మొదటి ప్రాధాన్యత అని టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తమిళనాడు క్రిష్ణగిరి జిల్లా గోప సంద్రం లోని దక్షిణ తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం నుండి తిరుమలకు పాదయాత్రగా వచ్చిన వందలాదిమంది భక్త బృందానికి శుక్రవారం ( ఆగస్టు 18) శ్రీనివాసమంగాపురంలో ఛైర్మన్ స్వాగతం పలికారు. భగవంతుని సేవకు పాదయాత్ర పెద్ద సాధనమన్నారు. దేవుడిని ఎక్కువ సమయం దర్శనం చేసుకోవడం కాదు… స్వామి భక్తుడికి అనుగ్రహించే క్షణకాల దర్శనం లభిస్తే చాలు అన్నారు. వీఐపీలు గంటల సమయం దేవుడి ఎదురుగా ఉన్నా ఆయన చూపు పేదల మీదే ఉంటుందని చెప్పారు. పూర్వం ఎందరో మహానీయులు కాలినడకన తిరుమల శ్రీవారిని దర్శించుకుని తరిస్తున్నారని చెప్పారు . పురందరదాసులు, వ్యాసరాజయతీశ్వరులు, శ్రీమాన్ అన్నమాచార్యులు, శ్రీకృష్ణదేవరాయలు లాంటి మహనీయులు భక్తి ప్రపత్తులతో తిరుమల కొండలను కాలినడకన వచ్చి స్వామివారి వైభవాన్ని వ్యాప్తి చేశారని వివరించారు.
