మ్యాచ్ మధ్యలో పాక్ ప్లేయర్ నమాజ్‌.. వకార్ వ్యాఖ్యలపై వివాదం

మ్యాచ్ మధ్యలో పాక్ ప్లేయర్ నమాజ్‌.. వకార్ వ్యాఖ్యలపై వివాదం

న్యూఢిల్లీ: భారత్, పాకిస్థాన్ మధ్య టీ20 మ్యాచ్ ముగిసి మూడ్రోజులు అవుతున్నా ఏదో ఒక కాంట్రవర్సీ వస్తూనే ఉంది. అత్యంత ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో ఇండియా 10 వికెట్ల తేడాతో ఓడిపోవడంతో టీమిండియా ప్లేయర్లపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున్న ట్రోలింగ్ జరుగుతోంది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ, మహ్మద్ షమిని టార్గెట్‌ చేసుకుని కామెంట్లు చేస్తున్నారు. ఈ విషయాన్ని పక్కనబెడితే.. భారత్, పాక్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో దాయాది జట్టు ఆటగాడు మహ్మద్ రిజ్వాన్ నమాజ్ చేయడంపై ఆ దేశ మాజీ బౌలర్ వకార్ యూనిస్ కామెంట్ చేయడం వివాదాస్పదం అవుతోంది. హిందూ ప్లేయర్ల ముందు రిజ్వాన్ నమాజ్ చేయడం తనకు చాలా  స్పెషల్‌గా అనిపించిందని ఓ టీవీ ఇంటర్వ్యూలో వకార్ యూనిస్ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. 

క్రికెట్‌ను మతంతో విభజించొద్దు 

వకార్ యూనిస్ కామెంట్లపై ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే స్పందించాడు. క్రికెట్‌కు మతంతో సంబంధం లేదన్న ఆయన.. వకార్ లాంటి వ్యక్తి నుంచి అలాంటి వ్యాఖ్యలు వినడం తీవ్రంగా నిరుత్సాహపర్చిందన్నాడు. ఆటల్లో ఇలాంటి వాటికి చోటు లేకుండా చూడాలన్నాడు. క్రికెట్‌కు అంబాసిడర్లయిన ప్లేయర్లు చాలా బాధ్యతతో వ్యవహరించాలని సూచించాడు. క్రికెట్ ప్రపంచాన్ని ఐక్యంగా ఉంచుదామని, మతంతో దాన్ని విభజించొద్దని పిలుపునిచ్చాడు. అన్ని వైపుల నుంచి తన కామెంట్లపై విమర్శలు రావడంతో వకార్ యూనిస్ వెనక్కి తగ్గాడు. క్షమాపణలు చెబుతూ ట్వీ్ట్ చేశాడు. 

కావాలని అనలే

‘నేను చేసిన కొన్ని వ్యాఖ్యలు పలువురి మనోభావాలను దెబ్బతీశాయి. కానీ నేను కావాలని అలా అనలేదు. దీనికి క్షమాపణలు చెబుతున్నా. ఇది ప్రత్యేకంగా ఎవర్నో ఉద్దేశించి చేసింది కాదు. అది నిజంగా తప్పే. జాతి, వర్ణం, మతానికి సంబంధం లేకుండా ఆటలు ప్రజలందర్నీ కలిపి ఉంచుతాయి’ అని వకార్ చెప్పాడు. క్షమాపణలు చెబుతూ అపాలజీస్ అనే ట్యాగ్‌ను ట్వీట్‌కు జత చేశాడు. 

మరిన్ని వార్తల కోసం: 

అమ్మో ఒకటో తారీఖు.. భయపడుతున్న ఆర్థికశాఖ

కెప్టెన్ నా సోల్‌మేట్.. మేం ప్రేమికులం కాదు

2500 నాటికి.. ఇండియా ఇట్లుంటదట!