ఇస్లామాబాద్: పంజాబ్ మాజీ సీఎం అమరిందర్ సింగ్ ఓ పాక్ జర్నలిస్టును ప్రేమించాడని అప్పట్లో పుకార్లు షికారు చేశాయి. అరూసా ఆలం అనే ఆ జర్నలిస్టుతో కెప్టెన్ ప్రేమపురాణం నడిపించాడని పొలిటికల్ సర్కిల్స్లో ఇప్పటికీ చెప్పుకుంటారు. అయితే దీనిపై అమరిందర్, అరూసాలు ఎప్పుడూ స్పందించలేదు. కాగా.. అమరిందర్, అరూసా బంధం గురించి పంజాబ్ డిప్యూటీ సీఎం సుఖ్జిందర్ సింగ్ రణ్ధావా తాజాగా పలు వ్యాఖ్యలు చేశారు. సిక్కు మతంలో వివాహేతర బంధాలకు చోటు లేదని కెప్టెన్ను ఉద్దేశించి విమర్శలు చేశారు. అరూసాకు పాక్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్ఐతో తనకు సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు చేశారు. వీటిపై అరూసా ఆలం ఘాటుగా స్పందించింది. రీసెంట్గా ఓ జాతీయ మీడియా చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమరిందర్తో తన బంధం గురించి అరూసా స్పందించారు. కెప్టెన్ తన సోల్మేట్ అని చెప్పిన అరూసా.. తాము లవర్స్ కాదని స్పష్టం చేసింది.
అలా అయితే భారత ఏజెన్సీలదే తప్పు
‘మేం సహచరులుగా ఉన్నాం. అమరిందర్ సింగ్ను తొలిసారి కలసినప్పుడు నా వయస్సు 56, ఆయన వయస్సు 66. అది ప్రేమికులను వెతుక్కునే వయస్సు కాదు. మేం మంచి స్నేహితులం, సహచరులం, సోల్మేట్స్. మా ఇద్దరి రిలేషన్లో లవ్ అఫైర్లు, రొమాన్స్కు చోటు లేదు. మేం మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్లా ఉన్నాం. నేను కెప్టెన్ తల్లితోపాటు ఆయన కుటుంబీకులను కలిశాను’ అని అరూసా చెప్పింది. ఐఎస్ఐతో లింక్స్ ఆరోపణలను ఆమె ఖండించింది. ‘పాకిస్థానీలకు వీసా రావడం పెద్ద తలనొప్పి ప్రక్రియ. పలు సెక్యూరిటీ చెకింగ్స్, బ్యాగ్రౌండ్ వెరిఫికేషన్ తర్వాతే వీసాను జారీ చేస్తారు. దీంట్లో కొన్ని ఏజెన్సీలు కలసి పని చేస్తాయి. నేను గత 16 ఏళ్లుగా ఇండియాకు వచ్చిపోతున్నా. కానీ ఒక్కసారి కూడా సెక్యూరిటీ క్లియరింగ్ విషయంలో నాకు సమస్యలు ఎదురుకాలేదు. నాకు ఐఎస్ఐతో లింక్స్ ఉంటే భారత ఏజెన్సీలకు తెలియకుండా ఉంటుందా? ఒకవేళ నేను ఐఎస్ఐ ఏజెంట్ అయితే.. ఇన్నేళ్లుగా నన్ను భారత్లోకి రానిస్తున్న ఆ దేశ సెక్యూరిటీ ఏజెన్సీలదే తప్పు కదా. వాళ్లు ద్రోహం చేస్తున్నట్లే కదా?’ అని అరూసా ఆలం ఎదురు ప్రశ్నించారు.