
- కలెక్టర్లు, పోలీసులు సమన్వయంతో పని చేయాలి
- కాళేశ్వరం నీరు లేకున్నా వరి సాగులో రాష్ట్రమే నంబర్ వన్
- ధాన్యం సేకరణ, ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ లేట్ చేయొద్దు
- మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి
- ఆఫీసర్ల పనితీరుపై మంత్రికి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేలు
వరంగల్, వెలుగు: రాష్ట్రంలో విత్తనాలు, ఎరువుల దందాపై కాంగ్రెస్సర్కార్ చాలా సీరియస్గా ఉందని, కలెక్టర్లు, పోలీసులు సమన్వయంతో పని చేసి, అక్రమార్కులపై ఉక్కుపాదం మోపాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. గురువారం హనుమకొండ కలెక్టరేట్లో ధాన్యం సేకరణ, వానాకాలం సాగు ముందస్తు ప్రణాళిక, ఇందిరమ్మ ఇండ్లు, భూభారతి, వరంగల్ ఎయిర్పోర్ట్పై ఉమ్మడి వరంగల్జిల్లాకు చెందిన ఆరుగురు కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ శాఖల అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఆరుగాలం చెమటోడ్చి పంటలు వేస్తే దిగబడి రావడం లేదన్నారు. రైతుల ప్రాణాలను హరిస్తున్న నకిలీ విత్తనాలు, ఎరువుల విక్రయాలకు ఫుల్స్టాప్ పెట్టాలని సూచించారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్నీరు లేకున్నా వరి సాగులో దేశంలోనే మన రాష్ట్రం నంబర్ వన్ స్థానంలో ఉందని చెప్పారు. ధాన్యం సేకరణ 85 శాతం పూర్తయిందని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి తాను సంతకాలు చేసిన మంజూరు పత్రాలను కలెక్టర్లు స్థానిక ఎమ్మెల్యేలకు అందజేయాలని చెప్పారు. ధరణి చట్టంతో ఇబ్బందులు పడ్డవారికి భూభారతి చట్టంతో న్యాయం చేయాలన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా డ్వాక్రా గ్రూపులతో కలిసి నియోజకవర్గ కేంద్రాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి,18 నెలల్లో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని వివరించాలని సూచించారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. నకిలీ విత్తనాలు, ఎరువుల కట్టడికి వేసిన టాస్క్ఫోర్స్కమిటీల్లో రైతులను భాగస్వామ్యం చేయాలన్నారు.
ఎమ్మెల్యేల ఫిర్యాదులు, రిక్వెస్ట్
అధికారుల తీరుపై కొందరు ఎమ్మెల్యేలు మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డికి ఫిర్యాదులు చేశారు. మరికొందరు తమ ప్రాంత సమస్యలను వివరించి, సహకారం అందించాలని రిక్వెస్ట్చేశారు. భూపాలపల్లి, నర్సంపేట ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణ, దొంతి మాధవరెడ్డి ధాన్యం కొనుగోలులో అధికారుల తీరుపై ఫిర్యాదు చేశారు. గండ్ర మాట్లాడుతూ.. తమ నియోజకవర్గంలో కొనుగోలు కేంద్రాలకు ట్రక్ షీట్లు కూడా పంపించడం లేదని ఆరోపించారు. 9 రైస్ మిల్లులు సన్నవడ్లను దొడ్డు వడ్లుగా బిల్లులు రాసి, రైతులకు బోనస్ రాకుండా అన్యాయం చేస్తున్నాయన్నారు. బాధ్యులపై పీడీ యాక్ట్నమోదు లేదంటే బ్లాక్ లిస్టులో పెట్టడం చేయాలని కోరారు. ఎమ్మెల్యే దొంతి మాట్లాడుతూ.. తమ నియోజకవర్గంలో ధాన్యం సేకరణ 50 శాతం కూడా పూర్తి కాలేదని తెలిపారు.
ఒక్క ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుకు కూడా శాంక్షన్ ప్రొసీడింగ్ కాపీ ఇవ్వలేదని, అధికారులు పట్టించుకోవట్లేదని చెప్పారు. ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రునాయక్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో వేగం లేదన్నారు. 15 ఏండ్ల క్రితం ఇళ్లు ఇచ్చామని, రేషన్ కార్డు లేదని, 60 ఏండ్ల వయసు ఉందనే సాకులతో అధికారులు ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్నారని పేర్కొన్నారు. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. క్యాతనపల్లిలో అర్హులకు పొజిషన్ సర్టిఫికెట్ లేదని ఆఫీసర్లు ఇండ్లు మంజూరు ఆలస్యం చేస్తున్నారని తెలిపారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి స్థానిక వాగుల నుంచి ఇసుక వాడుకునేలా చూడాలని కోరారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు మాట్లాడుతూ.. తమ నియోజకవర్గంలోకి ఇతర జిల్లాల నుంచి ధాన్యం వస్తోందని, దీనిపై విచారణ చేయాలని కోరారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి మాట్లాడుతూ.. సాదాబైనామాలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలన్నారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి మాట్లాడుతూ.. తమ నియోజకవర్గంలో ధాన్యం సేకరణ సజావుగా జరుగుతున్నట్లు పేర్కొన్నారు.
ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ.. నకిలీ విత్తనాలు, ఎరువుల కట్టడికి డీఎస్పీ స్థాయిలో టాస్క్ఫోర్స్కమిటీ వేయాలన్నారు. వరంగల్, హనుమకొండ కలెక్టర్లు సత్యశారద, ప్రావీణ్యతోపాటు జనగామ, ములుగు, మహబూబాబాద్, భూపాలపల్లి కలెక్టర్లు రిజ్వాన్ బాషా, టీఎస్.దివాకర, అద్వైత్ కుమార్, రాహుల్ శర్మ తమ జిల్లాల్లో పరిస్థితులను వివరించారు. సమావేశంలో ఎంపీ కడియం కావ్య, మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ వెంకట్రామిరెడ్డి, ఎస్పీలు పాల్గొన్నారు.