వరంగల్, వెలుగు: కేసీఆర్ కుటుంబం వేలాది కోట్లు అక్రమంగా సంపాదించిన విషయాన్ని మోసాలను ఆయన బిడ్డనే చెబుతోందని, రాబోయే రోజుల్లో కేసీఆర్కు జైలు కూడు తప్పదని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందరరెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ మోసచరిత్ర ఒక్కొక్కటి బయటకు తీస్తున్నామని, ఆయన చేసిన తప్పులకు జీవితాంతం జైల్లోనే ఉండాల్సి వస్తుందన్నారు. ఆదివారం కేసీఆర్ ప్రెస్మీట్ సందర్భంగా మాట్లాడుతూ ''తోలు తీస్తా” అంటూ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై సోమవారం నాయిని ఫైర్ అయ్యారు.
''కేసీఆర్.. నీ కుటుంబ అక్రమ సంపాదన, మోసాలను నీ బిడ్డనే ఒక్కొక్కటి చెబుతోంది చూడు” అంటూ ఫైర్ అయ్యారు. రెండు నిమిషాలు సరిగ్గా నిలుచోలేని వ్యక్తి తోలు తీస్తా అంటూ మాట్లాడుతున్నాడని, అసెంబ్లీలో చర్చకొచ్చే ముఖం లేదని అన్నింటిపై చర్చించేందుకు దమ్ముంటే అసెంబ్లీకి రావాలన్నారు. సీఎం చెప్పినట్లు ఆయన గౌరవానికి భంగం కలగకుండా చూస్తామన్నారు. వరంగల్ పర్యటనలో ఇచ్చిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ టెక్స్టైల్ పార్క్, జర్నలిస్టులకు ఇండ్ల నిర్మాణం, కల్లు దావత్ ముచ్చట్లు మరిచావా అంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్ తన మాటతీరు మార్చుకోకుంటే ఆయన వయసును చూడకుండా కామెంట్ చేయాల్సి వస్తుందన్నారు.
