- పంచాయతీ ఎన్నికల్లో భాగంగా వరంగల్ కమిషనరేట్ పోలీసుల ముమ్మర తనిఖీలు
- 156 లైసెన్సుడ్ వెపన్స్ స్వాధీనం
- 2,205 మంది బైండోవర్
హనుమకొండ, వెలుగు: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాలతో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. కమిషనరేట్ పరిధిలో 156 లైసెన్సుడ్ వెపన్స్ స్వాధీనం చేసుకున్నారు. రూ.6.04 లక్షల నగదు, 120 కేసుల్లో సుమారు రూ.10.69 లక్షల విలువైన మద్యం సీసాలు పట్టుకున్నారు. 46 కేసుల్లో లక్షా19 వేల విలువైన 322 లీటర్ల గుడుంబాతో పాటు రూ.లక్ష విలువైన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
రౌడీ షీటర్లు, అనుమానస్పద వ్యక్తులకు సంబంధించి 384 కేసుల్లో 2,205 మందిని బైండోవర్ చేశారు. ఎన్నికలకు విఘాతం కలిగిస్తే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని సీపీ సన్ ప్రీత్ సింగ్ హెచ్చరించారు. ఎవరైనా చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు.

