
కొందరు తల్లిదండ్రులంటే ప్రాణంలా చూసుకుంటారు. వాళ్లే తమకు దైవంగా అనుకుంటూ ఉంటారు. పిల్లలకు ఏదైనా కష్టం వస్తే తల్లిదండ్రులు ఎలా తాపత్రయ పడతారో.. పిల్లలు కూడా అదే విధంగా తమ వంతు సాహారం, కృషి చేస్తూ ఉంటారు. దీనికి ఉదాహరణగా నిలిచేలా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోను కేరళకు చెందిన అఫీషియల్ హ్యూమన్స్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. స్విట్జర్లాండ్లో ఐదేళ్లు గడిపిన కేరళకు చెందిన రోజన్ పరంబిల్ ఐదేళ్ల తర్వాత భారత్కు తిరిగి వచ్చారు. ఆ తర్వాత తన తల్లి ఆరోగ్యం క్షీణించడం చూసి బాధపడ్డాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోలో పరంబిల్ తన తల్లిని అతిరుంపుజ చూపించడానికి ఆమెను బయటకు తీసుకెళ్లడానికి కారు వద్దకు ఎత్తుకుని తీసుకువెళతాడు. అంతలోనే మరొక స్త్రీ ఆమెకు ఒక కప్పు టీ అందివ్వడం, ఆ తల్లి సంతోషంగా సిప్ చేయడం వీడియోలో చూడవచ్చు. ఈ తల్లీ కొడుకులిద్దరూ కలిసి దిగే సెల్ఫీ సైతం నెటిజన్లు ఎంతో ఆకర్షిస్తోంది.
"5 ఏళ్ళ క్రితం నేను అమ్మాచిని స్విట్జర్లాండ్కు తీసుకెళ్లి యూరప్ను చూపించాను. ఆమె కొత్త ప్రదేశాలను చూసి ముగ్ధురాలైంది. కానీ కోవిడ్ కారణంగా నేను దాదాపు 5 సంవత్సరాల తర్వాత భారతదేశానికి రాగలిగాను. అమ్మాచిని చూడగానే నా గుండె పగిలిపోయింది. ఆమె చాలా ముసలిదిగా కనిపించింది. మునుపటికంటే ఆమె జుట్టు మరింత తెల్లగా మారిపోయింది, ఆమె కూడా బలహీనంగా ఉంది. ఆమె సరిగ్గా నిలబడలేక, నడవలేకపోయింది. చాలా సంవత్సరాలుగా చర్చికి కూడా వెళ్లలేదని ఆమె నాకు చెప్పింది. నేను ఆమెను బయటకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాను" అని పరంబిల్ వీడియోలో తెలియజేశారు.
"నేను స్విట్జర్లాండ్లోని ఓ వృద్ధాశ్రమంలో పని చేస్తున్నాను. ఆ అనుభవంతో ఆమెకు స్నానం చేయించి, నా సోదరీమణులచే బట్టలు ఇప్పించి, ఆమెను నా కారులో తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాను. అది మంచి ఆలోచన కాదని అందరూ అన్నారు. కానీ నేను ఎలాగైనా ముందుకు వెళ్లాననుకున్నాను. ఆమెను నా భుజాల మీద ఎత్తుకుని కారులో కూర్చోబెట్టాను. ఆ తర్వాత 20 కి.మీల దూరంలో ఆమె స్వగ్రామం అతిరుంపుజకు వెళ్లాము. ఆమెకు చాలా ప్రదేశాలు గుర్తు పట్టలేదు కానీ అది ఆమెకు సంతోషాన్ని కలిగించింది. నేను వీడియోలు తీశాను. ఆమెను చూడటం ఆనందంగా ఉంది. నేను కూడా ఒకసారి ఆమెను 'నీలకురింజి' వికసించడాన్ని చూసేందుకు తీసుకువెళ్లాను. ఆమె ప్రయాణం తర్వాత అలసిపోయి అనారోగ్యంతో ఉంది కానీ ఎట్టకేలకు ఆమె ఎప్పటినుంచో కోరుకునే దాన్ని చూసినందుకు ఉప్పొంగిపోయింది" అని పరంబిల్ చెప్పారు.
ఈ వీడియో షేర్ చేసినప్పట్నుంచి 5.7లక్షల వ్యూస్, 72వేల లైకులు వచ్చాయి. దీన్ని చూడగానే తన కన్నీళ్లను నియంత్రించుకోలేకపోయినట్టు ఓ యూజర్ రాసుకొచ్చారు. "అమ్మను ఎప్పటికీ మరువలేరు. మీరు వారితో గడిపిన ప్రతి క్షణాన్ని ఆదరించాలి. జ్ఞాపకాలు మాత్రమే తర్వాత మిగిలిపోతాయి. మీరు ఆమెను అలా ఎత్తుకోవడ చాలా అద్భుతంగా ఉందని తాను భావిస్తున్న"ట్టు మరొక ట్విట్టర్ యూజర్ కామెంట్ చేశారు.