సముద్రమట్టాలు పెరిగినా నగరాలు మునగవిక
నీటిపై తేలాడే సిటీలకు ఐక్యరాజ్య సమితి ప్లాన్
భూతాపం పెరిగి భూమిపై మంచు కరుగుతున్నాకొద్దీ తీరప్రాంతాల్లోని గ్రామాలు, నగరాల ప్రజలు బెంబేలెత్తుతున్నారు.. ఉపద్రవం ఎప్పుడు ముంచుకొస్తుందోనని భయపడుతున్నారు.. అందుకే భూతాపాన్ని ఎలా ఆపాలా అని ప్రపంచ దేశాలు ఆలోచిస్తున్నాయి..కానీ ఐక్యరాజ్యసమితి ఇంకోరకంగా ఆలోచించింది.. సముద్రం పై తేలాడే నగరాలు నిర్మిస్తే ఏ సమస్యా ఉండదుగా అనుకుంది. సుస్థిర పట్టణాభివృద్ధిపై పని చేసే యూఎన్ హాబిటాట్ .. ఓషియానిక్స్ , మసాచుసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఎక్స్ ప్లో రర్స్ క్లబ్ తో కలసి సముద్రంపై తేలాడే నగరాలను సృష్టించేందుకు కృషి చేస్తోంది. 2100 నాటికి సముద్రమట్టం 77 సెంటీమీటర్లు పెరుగుతుందని ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ హెచ్చరిస్తోంది.
నమూనా నగరం కొద్దినెల్లలో..
న్యూయార్క్లోని యూఎన్ ప్రధాన కార్యా లయం దగ్గ ర ఈస్ట్ రివర్ ప్రాంతంలో తొలుత ఓ నమూనాను యూఎన్ సిద్ధం చేస్తోంది. మరికొద్ది నెలల్లో ఆ నగరాన్ని అందుబాటులోకి తీసుకొస్తామంటోంది. ఈ తేలాడే నగరంలోని ప్రజలకు కావాల్సిన ఆహారం, కరెంటు అంతా అక్కడే ఉత్పత్తి చేస్తారు. ఈ కదిలే నగరాల అడుగు భాగాలను సముద్రగర్భానికి గట్టి వైర్లతో కట్టేస్తారు. నగరం చుట్టూ తిరగడానికి పాడ్ లాంటి చిన్న చిన్న యంత్రాలుంటాయి. రెస్టారెంట్లు , హోటళ్లు, మార్కెట్లకు వాటిపైనే వెళ్లాలి. కానీ గ్లోబల్ వార్మింగ్ నుంచి దృష్టిని మరల్చేందుకే ఇలా కొత్త ఆలోచనలంటున్నారని కొందరు విమర్శిస్తున్నారు. ధనికుల కోసమే ఇలాంటి ఇళ్లు నిర్మిస్తున్నారని, ఇప్పటికే దుబాయ్ లో ఇలాంటి ఇళ్లున్నాయని గుర్తు చేస్తున్నారు. అవసరమైన వారికీ ఇళ్లు కట్టాలని సూచిస్తున్నారు.