- పశ్చిమాసియా సంక్షోభంతో నష్టపోయిన సెక్టార్లకు మద్ధతివ్వగలం
న్యూఢిల్లీ: గత పదేళ్లుగా ఆర్థిక క్రమశిక్షణ పాటించడంతో అప్పులు తక్కువగా ఉన్నాయని, ఆర్థికంగా మంచి స్థాయిలో ఉండడంతో ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించడంలో ప్రాబ్లమ్ లేదని ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ అన్నారు. అంతేకాకుండా పశ్చిమాసియా సంక్షోభం వల్ల నష్టపోయిన రంగాలను ఆదుకోవడానికి, పెట్టుబడులు కొనసాగించడానికి కూడా అవకాశం ఉందని చెప్పారు.
ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) వివరాలు బుధవారం వెలువడనున్నాయి. వడ్డీ రేట్లు యధాతథంగా ఉంటాయని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది గతంతో పోలిస్తే మరింత సవాళ్లతో కూడుకున్నదని, ఇరాన్ యుద్ధం రీజినల్ స్థాయి నుంచి గ్లోబల్ ఎనర్జీ సప్లయ్ రూట్లను కదిలించే స్థాయికి చేరిందని సీతారామన్ అన్నారు.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అస్థిరత పెరిగిందని, గ్లోబల్గా పబ్లిక్ డెట్ 106 ట్రిలియన్ డాలర్లకు, డెట్ టు జీడీపీ రేషియో 95 శాతానికి చేరిందన్నారు. మనది 81శాతం వద్ద ఉందని, పెద్ద ఆర్థిక వ్యవస్థలలో ఇదే తక్కువన్నారు.
