
ముంబై: గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన 'ఓట్ చోరీ' ఆందోళనలపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు శరద్ పవార్ స్పందించారు. తాము కూడా ఎన్నికల ఫలితాలను అధ్యయనం చేస్తున్నామని పేర్కొన్నారు. శుక్రవారం ముంబైలో ఆయన మీడియాతో మాట్లాడారు. "మేం ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తున్నాం.
ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపై నిలబడి ఈ 'ఓట్ చోరీ' సమస్యను దేశ ప్రజల ముందు ఉంచుతాం. రెండు వారాల్లో కచ్చితమైన ప్రణాళికను రూపొందిస్తాం" అని పవార్ చెప్పారు. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ నెల ప్రారంభంలో ఓట్ చోరీ అంశాన్ని లేవనెత్తారు. ఎన్నికల సంఘం, బీజేపీతో కుమ్మక్కై 'ఒక వ్యక్తి.. -ఒక ఓటు' సూత్రాన్ని అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు.