- 1200 మంది బిజినెస్లీడర్లతో డెలాయిట్ సర్వే
- టెక్స్టైల్, ఫార్మా, ఎలక్ట్రానిక్స్లో పెట్టుబడులకు ఛాన్స్
- ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో దేశం ముందడుగు
- సంస్కరణలూ భేష్
న్యూఢిల్లీ: ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లకు మన దేశమే ఎట్రాక్టివ్గా నిలుస్తోంది. ఎకనమిక్ గ్రోత్కు అవకాశముండటంతోపాటు, నిపుణులైన వర్క్ఫోర్స్ వల్లే మన దేశంలో పెట్టుబడులకు విదేశీ కంపెనీలు ఇష్టపడుతున్నాయి. షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్లు రెండింటిలోనూ ఇండియాలో గ్రోత్కు మెరుగైన అవకాశాలున్నాయని పెద్ద పెద్ద బిజినెస్ లీడర్లు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఇక్కడ పెట్టుబడులు పెట్టిన వారు వాటిని పెంచుతామని చెబుతున్నారని, కొత్తగా పెట్టాలనుకునే వారూ ముందుకొస్తున్నారని డెలాయిట్ సర్వేలో తేలింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, జపాన్, సింగపూర్లలోని మల్టీ నేషనల్ కంపెనీలకు చెందిన 1200 మంది బిజినెస్ లీడర్లతో ఈ సర్వే నిర్వహించినట్లు డెలాయిట్ వెల్లడించింది. ఇండియాస్ ఎఫ్డీఐ ఆపర్చునిటీ పేరిట ఈ సర్వేను నిర్వహించినట్లు తెలిపింది.
మన దేశంలో డిజిటైజేషన్, కస్టమ్స్ క్లియరెన్స్, మాన్యుఫాక్చరింగ్ రంగానికి ఇస్తున్న ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ వంటి అంశాలపై జపాన్లోని 16 శాతం బిజినెస్ లీడర్లకు, సింగపూర్లోని 9 శాతం బిజినెస్ లీడర్లకు మాత్రమే అవగాహన ఉన్నట్లు ఈ సర్వేలో తేలింది. దాంతో చైనా, వియత్నాంలతో పోల్చినప్పుడు ఇండియాలో వ్యాపారం కష్టతరమనే అభిప్రాయం వారిలో ఉందని రిపోర్టు పేర్కొంది. అయితే, రాజకీయ–ఆర్థికపరమైన కోణంలో మాత్రం ఇండియాను ఇష్టపడుతున్నారని, అయితే రెగ్యులేటరీపై క్లారిటీలేదని చెబుతున్నారని డెలాయిట్ రిపోర్టు వెల్లడించింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగ్గా లేదనే అంశాన్నీ ఇన్వెస్టర్లు లేవనెత్తుతున్నట్లు పేర్కొంది. ఈజ్ ఆఫ్ బిజినెస్ పట్ల ఇండియా చూపిస్తున్న శ్రద్ధ మరిన్ని మెరుగయిన ఫలితాలను తెస్తుందనే విశ్వాసం తమకు ఉందని డెలాయిట్ గ్లోబల్ సీఈఓ పునీత్ రంజన్ చెప్పారు. ప్రోత్సాహకాలు ఇవ్వడంతోపాటు, సంస్కరణలనూ ఇండియా తెస్తోందని పేర్కొన్నారు.
7 రంగాల్లో ఎన్నో అవకాశాలు
ఏడు రంగాలలో ఎఫ్డీఐలను ఆకర్షించేందుకు మన దేశంలో అవకాశాలున్నాయి. టెక్స్టైల్ అండ్ అపారెల్, ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్, ఫార్మాస్యూటికల్స్, వెహికల్స్ అండ్ పార్ట్స్, కెమికల్స్, క్యాపిటల్ గూడ్స్ రంగాలలో భారీగా విదేశీ పెట్టుబడులకు ఛాన్స్ ఉంటుందని అంచనా. 2020–21లో ఈ ఏడు రంగాలూ కలిపి మొత్తం 181 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు నిర్వహించాయి. పై ఏడు రంగాలలో ఎదగడానికి తగిన పరిస్థితులు ఉన్నాయని, తొందరగా ఫలితాలు కూడా రాబట్ట వచ్చని డెలాయిట్ సర్వే రిపోర్టు వెల్లడించింది. ఎగుమతుల కోసమే ఇండియాలో తయారు చేయడం కాకుండా, ఇండియాలోనే వినియోగం కోసమూ పెట్టుబడులు పెట్టాలని జపాన్లోని బిజినెస్ లీడర్లు భావిస్తున్నారు. చైనా, బ్రెజిల్, మెక్సికో, వియత్నాం వంటి మార్కెట్లతో పోలిస్తే యూఎస్లో ఇండియాపైనే మంచి అభిప్రాయం ఉందని ఈ రిపోర్టు తెలిపింది. యూఎస్, యూకేలలోని బిజినెస్ లీడర్లు మన దేశం వైపే మొగ్గుచూపుతున్నట్లు పేర్కొంది. అయితే జపాన్, సింగపూర్లలోని బిజినెస్ లీడర్లు మాత్రం వియత్నాంకు పెద్ద పీట వేస్తున్నట్లు వివరించింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ను మెరుగుపరచడంపై మన దేశం చేస్తున్న ప్రయత్నాలకు ప్రశంసలు వస్తున్నాయని తెలిపింది.