ఆదిలాబాద్, వెలుగు : ‘మాకు ఏ పార్టీతోనూ పొత్తు లేదు, మేము ఏ పార్టీకి కూడా మద్దతు ఇవ్వడం లేదు, మున్సిపల్ ఎన్నికల్లో స్వతంత్రంగానే పోటీ చేస్తాం’ అని హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఆదిలాబాద్ పట్టణంలో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ తిరుగుతూ ఎంఐఎం క్యాండిడేట్లకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆదిలాబాద్లో అనేక సమస్యలు ఉన్నాయని, ముఖ్యంగా వార్డుల్లో మౌలిక వసతులు కరువయ్యాయన్నారు. మూతపడ్డ సిమెంట్ పరిశ్రమను వెంటనే పునరుద్ధరించాలని దీని వల్ల వేలాది మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్ నిర్మాణం వెంటనే చేపట్టాలని, ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్ మీదుగా హైదరాబాద్కు రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
