న్యూఢిల్లీ: ఇండియాలో జరగనున్న జూనియర్ హాకీ వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ జట్టు వైదొలిగింది. ఈ మేరకు ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ (ఎఫ్ఐహెచ్) శుక్రవారం ధ్రువీకరించింది పాక్ ప్లేస్లో ఆడే మరో జట్టును త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించింది. గ్రూప్–బిలో ఇండియా, చిలీ, స్విట్జర్లాండ్తో పాటు పాక్ బరిలోకి దిగాల్సి ఉంది.
నవంబర్ 28 నుంచి డిసెంబర్ 10 వరకు చెన్నై, మధురైలో వరల్డ్ కప్ మ్యాచ్లు జరగనున్నాయి. ఈ ఏడాది ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 7 వరకు బిహార్లోని రాజ్గిర్లో జరిగిన ఆసియా కప్లోనూ పాక్ ఆడలేదు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఇండో–పాక్ మధ్య క్రీడా సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. పాకిస్తాన్తో సిరీస్ మాత్రం ఆడబోమని తేల్చి చెప్పిన ఇండియన్ గవర్నమెంట్ మల్టీ నేషన్స్ టోర్నీల్లో మాత్రం ఎప్పట్లానే పోటీపడతామని వెల్లడించింది.
ఈ నేపథ్యంలో ఆసియా కప్ క్రికెట్లోనూ టీమిండియా బరిలోకి దిగినా.. పాక్ కెప్టెన్తో సూర్యకుమార్ కరచాలనం చేసేందుకు నిరాకరించాడు. మరోవైపు మెగా టోర్నీ నుంచి పాక్ వైదొలగడంపై తమకు ఎలాంటి సమాచారం లేదని హాకీ ఇండియా (హెచ్ఐ) తెలిపింది. ‘నేను నెలన్నర కిందట పాక్ హాకీ ఫెడరేషన్ అధికారులతో మాట్లాడాను. వాళ్లు టోర్నీలో పాల్గొంటామని చెప్పారు. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. ఆతిథ్య జట్టుగా మేం అత్యుత్తమ టోర్నీని నిర్వహించేందుకు కట్టుబడి ఉన్నాం. అదే టైమ్లో ఇండియా టైటిల్ గెలుస్తుందని ఆశిస్తున్నాం. పాక్ ప్లేస్లో ఎవర్ని తీసుకుంటారో ఎఫ్ఐహెచ్ నిర్ణయిస్తుంది’ అని హెచ్ఐ పేర్కొంది.
మరోవైపు ప్రత్యామ్నాయ జట్టు కోసం చూస్తున్నామని ఎఫ్ఐహెచ్ చెబుతుండగా, పాకిస్తాన్ మాత్రం తటస్థ వేదికలో ఆడేందుకు సుముఖత వ్యక్తం చేసింది. రెండు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతల కారణంగా జూనియర్ టీమ్ ఇండియా వెళ్లకూడదని సూత్రప్రాయంగా నిర్ణయించామని పాక్ సమాఖ్య సెక్రటరీ జనరల్ రాణా ముజాహిద్ వెల్లడించాడు.
‘టోర్నీ ఇండియాలో జరుగుతున్నందున మేం ప్రధాన ఈవెంట్లను కోల్పోతున్నాం. మా టీమ్ పాల్గొనేందుకు తటస్థ వేదికను ఏర్పాటు
చేయాలని ఎఫ్ఐహెచ్ను కోరాం. ఇండియాలో ఆడటం మా హాకీ స్ఫూర్తిని దెబ్బతీస్తోంది. తటస్థ వేదికల్లో కూడా వేర్వేరు క్రీడల్లో కరచాలనం చేయడానికి కూడా ఇండియా అథ్లెట్లు ఇష్టపడనప్పుడు మేం అక్కడికి వెళ్లి ఎలా ఆడాలి? ఇదే విషయాన్ని ఎఫ్ఐహెచ్ ముందు ఉంచాం. వాళ్లు ఏ నిర్ణయం తీసుకుంటారో చూస్తాం’ అని ముజాహిద్ వ్యాఖ్యానించాడు.
