- బాధితులకు బంజారాహిల్స్ లో ఇండ్లు కట్టించాలి ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్
మెహిదీపట్నం/గండిపేట, వెలుగు: పేదల ఇండ్లు కూలిస్తే ఊరుకునేది లేదని, బుల్డోజర్లకు అడ్డంగా పడుకుని కాపాడుకుంటామని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి చెప్పారు. గురువారం మధ్యాహ్నం ఆయన కార్వాన్ ఇన్చార్జి అమర్ సింగ్, సిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గంజి రఘునాథ్ ఆధ్వర్యంలో జియాగూడ, లంగర్ హౌస్, రాందేవ్ గూడలోని మూసీ ప్రాంత ప్రజలను కలిశారు. రాత్రికి రాత్రి ఇంటికి ముద్రలు వేసి కూలుస్తామంటే ఊరుకోబోమని హెచ్చరించారు. మూసీ రివర్బెడ్ బాధితులకు సీఎం రేవంత్ రెడ్డి బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లో ఇల్లు కట్టిస్తానంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. శనివారం బీజేపీ ఆధ్వర్యంలో మహాధర్నా చేస్తామని వెల్లడించారు. ఆయన వెంట ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, హైదరాబాద్ పార్లమెంట్ కన్వీనర్ ఇంద్రసేనారెడ్డి ఉన్నారు. అలాగే అత్తాపూర్ డివిజన్లోని టీకేఆర్ నగర్, భరత్నగర్లో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్తో కలిసి ఈటల రాజేందర్పర్యటించారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు అండగా ఉంటామన్నారు.
