కరోనా వైరస్ కారణంగా నిలిచిపోయిన రైళ్లను దశల వారీగా పునరుద్ధరిస్తామని తెలిపింది భారతీయ రైల్వే. అన్ని రైళ్లు పూర్తిస్థాయిలో ఎప్పుడు అందుబాటులోకి వస్తాయనే దానిపై ప్రస్తుతానికి ఎలాంటి తేదీని నిర్ణయించలేదని ప్రకటించింది. క్రమంగా రైళ్ల సంఖ్యను పెంచుకుంటూ పోతున్నామని.. ఇప్పటివరకు మొత్తం 65 శాతం రైళ్లు పునఃప్రారంభమయ్యాయని ప్రకటించింది. ఒక్క జనవరి నెలలోనే 250కి పైగా రైళ్లు పునఃప్రారంభమయ్యాయని, రాబోయే రోజుల్లో మరికొన్ని రైలు సర్వీసులు అందుబాటులోకి వస్తాయని రైల్వే డిపార్టుమెంట్ తెలిపింది
భారతీయ రైల్వే తన మొదటి ఎయిర్ కండీషన్డ్ త్రీ టైర్ ఎకానమీ క్లాస్ కోచ్ను ప్రారంభించింది. ప్రపంచంలోకెల్లా అత్యంత చౌకైన, ఉత్తమమైన ఏసీ ప్రయాణాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో దీన్ని ప్రారంభించారు. ఈ కోచ్లలో ఛార్జీలు ఏసీ త్రీ-టైర్, నాన్- ఏసీ స్లీపర్ క్లాస్ మధ్య ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. రైళ్లలో ఈ నూతన ఎస్3 టైర్ ఎకానమీ కోచ్లను చేర్చడం ద్వారా ప్రస్తుతం 72గా ఉన్న బెర్త్ల సంఖ్య 83కి పెరగనుంది. తద్వారా ఎక్కువ మంది ప్రయాణికులను తీసుకెళ్లే సౌకర్యం కలుగుతుంది. ప్రతి కోచ్లో మోడరన్ డిజైన్తో రూపొందించిన సీట్లు, బెర్తులను చేర్చింది. ఫోల్డబుల్ స్నాక్ టేబుల్స్, వాటర్ బాటిల్స్, మొబైల్ ఫోన్, మ్యాగజైన్ల కోసం ప్రత్యేక హోల్డర్లను ఏర్పాటు చేసింది రైల్వేశాఖ.