హైదరాబాద్, వెలుగు: 2024–25 ఆర్థిక సంవత్సరం నాటికి ఎలక్ట్రిక్ వెహికల్ను లాంచ్ చేస్తామని మారుతీ సుజుకీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (మార్కెటింగ్, సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ వెల్లడించారు. అయితే ప్రస్తుతం మొత్తం ఫోర్ వీల్స్ అమ్మకాల్లో వీటి వాటా 1.1 శాతం కంటే తక్కువగానే ఉందని, తగినంత చార్జింగ్ నెట్వర్క్ లేకపోవడం, ధరలు ఎక్కువగా ఉండటం ఇందుకు కారణమని చెప్పారు. హైదరాబాద్లో శుక్రవారం 3,500వ షోరూమ్ను ప్రారంభించిన సందర్భంగా ఆయన మీడియా తో మాట్లాడారు. ఈ ఏడాది అమ్మకాలు రికార్డుస్థాయిలో ఉన్నాయని, ఏప్రిల్–అక్టోబరు మధ్య 9.57 లక్షల యూనిట్లు అమ్మామని పేర్కొన్నారు. తమ మార్కెట్ వాటా 42 శాతానికి చేరిందని చెప్పారు. ఇక నుంచి మరిన్ని ఎస్యూవీ, సీఎన్జీ మోడల్స్ తెస్తామని ప్రకటించారు. త్వరలో రెండు ఎస్యూవీలను లాంచ్ చేస్తామన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి మార్కెట్ వాటాను 50 శాతానికి పెంచడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని వివరించారు. ‘‘హైదరాబాద్ మాకు టాప్–3 మార్కెట్.
ఇక్కడ నెలకు 4,500లకుపైగా వెహికల్స్ అమ్ముతున్నాం. అయితే సెమీ కండక్టర్ల కొరత ఇప్పటికీ పూర్తిగా తీరలేదు. డిమాండ్కు తగినంత సరఫరా చేయలేకపోతున్నాం. ఇంకా మేం 4.6 లక్షలకుపైగా వెహికల్స్ను డెలివరీ ఇవ్వాలి. మేం ఏటా దేశవ్యాప్తంగా 200 వరకు అవుట్లెట్స్ను తెరుస్తున్నాం. హైదరాబాద్లో మాకు 35 అవుట్లెట్స్ ఉన్నాయి. మెటీరియల్స్ ధరలు విపరీతంగా పెరిగాయి కాబట్టే బండ్ల రేట్లను పెంచాల్సి వచ్చింది”అని ఆయన వివరించారు. పెరిగిన డిమాండ్కు అనుగుణంగా మనేసర్లోని ప్లాంట్లో ఉత్పత్తి సామర్థ్యాన్ని లక్ష యూనిట్లకు పెంచుతామని కంపెనీ తెలిపింది. మారుతి సుజుకీ ఇండియాకు ప్రస్తుతం భారతదేశంలోని దాదాపు 2,250 అవుట్లెట్లు ఉన్నాయి. కంపెనీ 2021–-22లో 237 సేల్స్ అవుట్లెట్లను, ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-–అక్టోబర్ మధ్య మరో 170 అవుట్లెట్లను మొదలుపెట్టిందని శ్రీవాస్తవ వివరించారు.