సెప్టెంబర్ 17లోగా నిజాం షుగర్ ఫ్యాక్టరీని రీఓపెన్ చేస్తాం : సీఎం రేవంత్ రెడ్డి

 సెప్టెంబర్ 17లోగా  నిజాం షుగర్ ఫ్యాక్టరీని రీఓపెన్ చేస్తాం :  సీఎం రేవంత్ రెడ్డి

సెప్టెంబర్ 17లోగా  నిజాం షుగర్ ఫ్యాక్టరీని రీఓపెన్ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.  బోధన్ షుగర్ ఫ్యాక్టరీని తెరిపించేందుకు కమిటీ వేశామన్నారు. నిజామాబాద్లో నిర్వహించిన  జనజాతర సభలో సీఎం పాల్గొన్నారు. కవిత ఎంపీగా ఉన్నప్పుడు నిజామాబాద్‌ రైతులను పట్టించుకోలేదన్నారు.  వందరోజుల్లో షుగర్ ఫ్యాక్టరీని రీఓపెన్ చేయిస్తానని  చేయలేదని,  పసుపు బోర్టు తేలేదని విమర్శించారు.  

కవిత ఓటమి తర్వాత పీనుగులను తినే వ్యక్తి వచ్చాడంటూ అర్వింద్ పై సీఎం మండిపడ్డారు. పసుపు బోర్డు పేరుతో అర్వింద్  ప్రజలను  మోసం చేసిండన్నారు సీఎం.  పసుపు బోర్డుపై  ప్రధాని మోదీ ఇచ్చిన ప్రకటనలో ఎక్కడా నిజామాబాద్‌ పేరు లేదన్నారు.  కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని  జీవన్ రెడ్డిని వ్యవసాయ కేంద్రమంత్రిగా చూస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. జీవన్ రెడ్డిని గెలిపించండి, కేంద్ర మంత్రిని చేసుకోండి అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ కు ఓటెస్తే అరాచకానికి తలుపులు తెరిచనట్లేనని సీఎం హెచ్చరించారు.  

ఒక్కోసారి ఓటమి కూడా గెలుపుకు పునాది వేస్తుందని  చెప్పారు సీఎం.  తాను  2018 ఎన్నికల్లో ఓడిపోతే  మాల్కాజిగిరి నుంచి ఎంపీగా గెలిచి  కాంగ్రెస్ అధిష్టానాన్ని అకర్షించి... పీసీసీ చీఫ్,  సీఎం అయ్యాయని గుర్తుచేశారు.  జీవన్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయారని ఎంపీగా  ఆయనకు అవకాశం ఇవ్వాలని  ప్రజలను కోరారు.  

ప్రభుత్వం ఏర్పాటు అయిన వంద రోజుల్లోనే ఐదు గ్యారంటీలు అమలు చేశామని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు.  ఆరో గ్యారంటీ రుణమాఫీ పథకం చేపట్టేలోపే.. ఎన్నికల కోడ్‌ వచ్చిందని..  ఎన్నికల కోడ్‌ ముగియగానే రుణమాఫీ ప్రక్రియ ప్రారంభం అవుతుందని చెప్పారు.  ఆగస్టు 15లోపు రైతులకు రుణమాఫీ చేసి తీరుతామని సీఎం హామీ ఇచ్చారు.   ఆగస్టు15 లోపు రూ.2లక్షల రుణమాఫీ చేసి రైతుల రుణం తీర్చుకుంటానని హామీ ఇచ్చారు.  రైతులు ఎంత పంట పండించిన  500 రూపాయిలు బోనస్ ఇచ్చి ప్రతి గింజ కొంటారని తెలిపారు.  

ప్రదాని మోడీ ఓటమి భయంతోనే మతాల మధ్య చిచ్చు పెట్టేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి.  హిందువుల ఆస్తులు ముస్లింలకు పెడతామని మోడీ తప్పుడు ప్రచారం చేస్తున్నారనని చెప్పారు.  మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలని బిజెపి ప్రయత్నం చేస్తోంది ఆరోపించారు.  దేశాన్ని మత సామరస్యానికి చిహ్నంగా ఉండేలా రాజ్యాంగం చేసిందన్నారు సీఎం.